రైతన్నల ఉసురు మంచిది కాదు
వడ్ల యుద్ధం కొనసాగిస్తాం.. ప్రతి గింజా కొనే వరకు ఊరుకోం
ఇంధన ధరలతో పేదలపై పెనుభారం
కేంద్రం తీరుపై గులాబీ శ్రేణుల ఆగ్రహం
కేంద్రం దిగొచ్చే వరకు పోరాటాలు
పంజాబ్కో న్యాయం..తెలంగాణకో న్యాయమా?
కొంటామన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు?
కేంద్ర సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి..
కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ధ్వజం
మేడ్చల్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డితో పాటు అన్నదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధాన్యం కొనేవరకు ఊరుకునేది లేదని, ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పంటలు వేయండి.. ధాన్యం బాజాప్తా కొంటామన్న బీజేపీ నాయకులు ఏరీ అని వారు ప్రశ్నించారు. అన్నదాతల ఉసురు మంచిది కాదని హితవు పలికారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన విధానాలతో పెట్రోల్, డీజిల్ రేట్లు అడ్డగోలుగా పెరుగుతున్నాయని, పేదలపై పెనుభారం పడుతున్నదంటూ.. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు.
మేడ్చల్, ఏప్రిల్ 7 (నమస్తేతెలంగాణ) : యాసంగిలో పండిన ప్రతి ధాన్యం గింజను కేంద్రం కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామని, తాడోపేడో తేల్చుకుంటామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. వడ్లను కొంటామన్న రాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేంద్ర సర్కారు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులకు మద్దతుగా మేడ్చల్ జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. దీనికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ వడ్లు కొనేవరకు కేంద్రంపై యుద్ధం కొనసాగుతుందని, రైతుల ఆగ్రహానికి గురికాకముందే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో పంటలు బ్రహ్మాండంగా పండుతుంటే బీజేపీ నాయకులకు మింగుడుపడడం లేదన్నారు. పంజాబ్లో ఎట్ల కొంటారు ? తెలంగాణలో ఎందుకు కొనరు ? అని ఆయన నిలదీశారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను మించి తెలంగాణ దిగుబడి సాధిస్తుందని చెప్పారు.
బీజేపీ నాయకులు చరిత్రహీనులుగా మిగులుతారు..
కష్టపడి పండించిన వడ్లను కేంద్రం కొనకుంటే బీజేపీ నాయకులు చరిత్రహీనులుగా మిగలడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. వరి పంటను తగ్గించాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచిస్తే..బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు దమ్ముంటే కేంద్రంతో వడ్లు కొనుగోలు చేయించాలని సూచించారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించడం ఖాయంగా కనిపిస్తుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 11 ఢిల్లీలో దద్దరిల్లేలా దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. శుక్రవారం రైతులంతా ఇండ్లపై నల్లజెండాలు ఎగురేయాలని, పురపాలక కేంద్రాల్లో బైక్ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్కుమార్, శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అనేకమంది రైతులు పాల్గొన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి నిరసన దీక్ష వరకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్ పాదయాత్ర నిర్వహించారు.
రైతులకు అన్యాయం చేయొద్దు
కష్టపడి పంట పండించిన రైతులకు అన్యాయం చేయవద్దు. వ్యవసాయం మీదే ఆధారపడిన మాలాంటి కుటుంబాల బాధను అర్థం చేసుకోవాలి. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం. – కృష్ణవేణి
వడ్లు కొని తీరాల్సిందే..
యాసంగి వడ్లను కేంద్రం కొనాల్సిందే. కొనుగోలు చేయనట్లయితే బీజేపీకి పుట్టగతులు ఉండవు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి. -లక్ష్మి