ఎల్బీనగర్, ఫిబ్రవరి 15 : నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్ వద్ద నూతనంగా నిర్మించే బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో అరణ్య భవన్లో వన్యప్రాణి మండలి(వైల్డ్ లైఫ్ బోర్డు) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ… హరిణ వనస్థలికి చెందిన 1354 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపులకు అనుమతించారని తెలిపారు. జాతీయ రహదారిపై విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్ టెర్మినల్ నిర్మాణం కానున్నదని వెల్లడించారు. రూ.18 కోట్లతో 24 బస్ బేల నిర్మాణం చేపడుతామని తెలిపారు. అత్యాధునిక బస్ టెర్మినల్లో 60 శాతం విద్యుత్ను సోలార్ ప్లాంట్ ద్వారా సేకరించనున్నట్లు పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ కోసం 490 కిలోవాట్స్ సౌర విద్యుత్ ప్లాంట్, వైఫై సౌకర్యం, నీటిశుద్ధి కేంద్రం, పార్కింగ్ వసతులు, ఏటీఎం కేంద్రాలు, ఫుడ్ కోర్టులు, బుక్ షాపు, ఆరోగ్య కేంద్రం వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో ప్రధాన ముఖ్య అటవీసంరక్షణ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్, సభ్యులు కోవ లక్ష్మి , రాఘవ, బానోతు రవికుమార్, అనిల్కుమార్, అధికారులు పర్గెయిన్, ప్రశాంతి, శంకరన్, తదితరులు పాల్గొన్నారు.