హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను చంపాడు. ఈ ఘటన నగరంలోని టపాచ్చబుత్రా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్ణాటక బీదర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్(45), మంగళమ్మ(40) దంపతులు 15 ఏండ్ల క్రితం నగరానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా, పెద్ద బిడ్డకు వివాహమైంది. అయితే శ్రీనివాస్ వృత్తిరీత్యా పెయింటర్ కాగా, మంగళమ్మ ఇండ్లలో పని చేస్తోంది.
మద్యానికి బానిస అయిన శ్రీనివాస్.. భార్యతో నిత్యం గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నిద్రిస్తున్న భార్యపై రొకలిబండతో దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.