Minister Srinivas Yadav | కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశించారు. నగర పరిధిలోని ముషీరాబాద్, అంబర్పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రజలు బొందపెడుతారన్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? అంటూ ప్రశ్నించారు.
ఓటమి తప్పదనే భయంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారని విమర్శించారు. రెండుసీట్లు గెలిచిన బీజేపీ బీసీని ఎలా ముఖ్యమంత్రిని చేస్తుందని నిలదీశారు. కేంద్రమంత్రిగా పార్లమెంట్ నియోజకవర్గంలో గానీ.. అంబర్పేట నియోజకవర్గంలో కానీ ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ రాష్ట్రం అధికారంలో వచ్చేది ముమ్మూటికి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.