మియాపూర్, మార్చి 4 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తానని గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటున్నట్లు విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి విస్తృతమైన మౌలిక వసతుల కల్పనను చేపట్టామని, పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే అభివృద్ధి నినాదంపై విప్ గాంధీ చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరింది. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని బాగ్మీర్, శాంతినగర్, సుమిత్రనగర్, చైతన్యనగర్, కమలప్రసన్ననగర్, ఆల్విన్ కాలనీ 1, మాధవరంనగర్ కాలనీల్లో ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ కార్పొరేటర్ రంగారావుతో కలిసి విప్ గాంధీ శనివారం పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలేమిటని, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటున్నారా? అని విప్ గాంధీ బస్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోనూ అదే స్థాయిలో నిలిపేందుకు అవినీతి రహితమైన పాలనను అందించేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు.
నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను గుర్తిస్తూ, కాలనీ బాగోగులను చూసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే డివిజన్లో 85 శాతానికి పైగా అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు, మిగిలిన వాటిని పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి సౌకర్యాన్ని కలుగజేస్తామన్నారు. పార్టీ శ్రేణులు సైతం నిత్యం ప్రజల వెంటే ఉండి వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, తక్షణ పరిష్కారం కోసం పాటుపడుతానన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, అప్పుడే మరింత మెరుగైన ఫలితాలుంటాయని విప్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నేతలు, మహిళా కార్యకర్తలు, వార్డు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన పలువురికి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా.. మంజూరైన రూ.6.50 లక్షల నిధుల మంజూరు పత్రాలను ఎంపీ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి విప్ గాంధీ తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే తమ సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందుకోసం అహరహం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సంజీవరెడ్డి, భాస్కర్రావు, చంద్రకాంత్రావు, కాశీనాథ్, శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్క్లేవ్లోని శ్రీపద్మావతి ఆండాళ్ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ 15వ వార్షికోత్సవంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, జములయ్య, నరేందర్రెడ్డి, రమణారెడ్డి, గంగిరెడ్డి, సాయికృష్ణ, శ్రీకాంత్, తిరుపతి, అమరేందర్ పాల్గొన్నారు.