మాదాపూర్, జనవరి 23: కంటివెలుగు పథకం దేశానికే ఆదర్శమని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 2 కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్తో పాటు స్థానిక నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు శిబిరాన్ని తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు, స్క్రీనింగ్లను చేస్తారన్నారు.
నాణ్యతతో కూడిన వైద్య చికిత్సను ఉచితంగా ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి 100 రోజుల పాటు కంటి వెలుగు ఉచిత పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ ఉషారాణి, హఫీజ్పేట్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్రావు, హఫీజ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వెంకటేశ్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, జనార్దన్, మల్లేశ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్, రాము, అశోక్, ఉమా మహేశ్వరరావు ఉన్నారు.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కల్చరల్ క్లబ్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒకరు కంటి వెలుగు శిబిరానికి విచ్చేసి చికిత్స చేసుకోవాలని అన్నారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.