మారేడ్పల్లి, మార్చి 16 : కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళ రైలు కింద పడి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం… శాయంపేట, హన్మకొండ ప్రాంతానికి చెందిన రాచెర్ల ప్రభాకర్, సంధ్యరాణి దంపతులు. ప్రభాకర్ ఆర్ఎంపీ డాక్టర్ కాగా, సంధ్యారాణి గృహిణి. ఈ నెల 17న చర్లపల్లిలో మేనకోడలు వివాహం ఉండగా, కుటుంబ సభ్యులు 11 మందితో కలిసి గురువారం సాయంత్రం వరంగల్ నుంచి హైదరాబాద్కు పుష్పుల్ ప్యాసింజర్ రైలు బయలు దేరారు.
సాయంత్రం రైలు చర్లపల్లి రైల్వేస్టేషన్కు చేరుకోగా కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరూ రైలు దిగారు. రైలు నెమ్మదిగా కదులుతుండగా..అప్పటికే రైల్లో ఉన్న సంధ్యారాణి, ప్రభాకర్ ఫ్లాట్ఫారంపై దిగేందుకు ప్రయత్నించారు. ప్రమాదవశాత్తు సంధ్యరాణి రైలు కింద పడి మృతి చెందగా, ప్రభాకర్ కాలు విరిగింది. కుటుంబ సభ్యులు ప్రభాకర్ ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. రైల్వే పోలీసులు సంధ్యారాణి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.