సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ ): విశ్వనగరంగా వెలుగులీనుతున్న హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా కక్షగట్టింది. పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని ఇప్పుడు మూడు ముకలు చేసి అభివృద్ధికి మంగళం పాడింది. కొత్త కార్పొరేషన్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన సరారు, బడ్జెట్లో వీటికి పైసా కూడా కేటాయించకుండా నగర పాలక సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. ఎన్నికల ఏడాదిలో నగరాన్ని ఉద్దరిస్తారని ఆశించిన పౌరులకు.. కాంగ్రెస్ మారు అరకొర పద్దులతో నిరాశే ఎదురైంది. మూడు నగర పాలక సంస్థల పరిధిలో మౌలిక సదుపాయాలకు అధికారులు సుమారు రూ. 11 వేల కోట్లు అవసరమని కమిషనర్లు ప్రతిపాదిస్తే.. సరారు మాత్రం పాత హెచ్ -సిటీ ప్రాజెక్టులకు కేవలం రూ. 2,654 కోట్లు మాత్రమే విదిల్చింది. ఉద్యోగుల వేతనాలకు రూ. 15.01 కోట్లు, వాహనాల పన్ను రూ.10కోట్లు, ప్రొవిజనల్ ట్యాక్స్కు రూ. 10కోట్ల మేర కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా అడిగిన దాంట్లో రూ. 2,689 కోట్ల పావలా కేటాయింపులు ఏ మూలకు సరిపోవని నిపుణులు మండిపడుతున్నారు. ఇప్పటికే నెలకు నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు భారంగా మారడం..నెలకు రూ. 200కోట్లు కిస్తీలకు వెళుతున్న తరుణంలో మూడు నగర పాలక సంస్థలు మరింత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనున్నదని, పౌర సేవలపై తీవ్ర ప్రభావం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విడగొట్టి, ఒకో దానికి రూ. 500 కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికిన పాలకులు, తీరా బడ్జెట్ సమయానికి ఆ హామీని గాలికి వదిలేశారు. విభజన సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ప్రతి కార్పొరేషన్కు రూ. 500 కోట్ల మేర నిర్వహణ ఖర్చులకు ఇస్తామని ప్రకటించారు. కానీ బడ్జెట్లో కనీసం నయా పైసా కేటాయింపులు లేకపోవడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నారు. తొలుత నగర శివారులోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, విశ్వ నగర స్థాయి సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వం ఆకాశమంత ఆశలు కల్పించింది…కానీ ఎక్కువ సమయం తీసుకోకుండానే జీహెచ్ఎంసీ శివారు ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. విలీనం ముందు బడంగ్పేట, నార్సింగి, మణికొండ పురపాలికలు ప్రతి ఏటా రూ.200కోట్ల మేర సర్ఫ్లస్లో బడ్జెట్ ఉండేదని, ఇప్పుడు మౌలిక వసతుల కల్పనపై సవతి ప్రేమ తగదని మండిపడుతున్నారు. విలీనమైన పురపాలికలకు అభివృద్ధిలో జీహెచ్ఎంసీ ‘మొండిచెయ్యి’ చూపడం అన్యాయమని పేర్కొంటున్నారు. ఖజానా నింపేది మేమే..కష్టాలు పడేది మేమేనా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వికేంద్రీకరణ పేరుతో చేసిన ఈ విభజన వల్ల అభివృద్ధి కుంటుపడటమే కాకుండా, సమన్వయ లోపంతో పౌర సేవలు అగమ్యగోచరంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కొత్త కార్పొరేషన్లలో చేరిన ఉద్యోగుల వేతనాలు, కార్యాలయాల అద్దెలు, రోజువారీ ఖర్చులకు నిధులు ఎకడి నుంచి తెస్తారో ఎవరికీ అంతుచికడం లేదు.
గడిచిన రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ సర్కారు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పనులు మొదలు పెట్టలేదు..పురోగతిలో ఉన్న ప్రాజెక్టు పనులను నత్తనడకన చేపడుతూ వస్తున్నది. కట్టిన ఇంటిని సున్నం వేసి ..బీఆర్ఎస్ ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు జరుపుతూ హడావుడి చేస్తున్నదే తప్ప కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది. పూర్తిగా సామాన్య పౌరుడి అవసరాలను విస్మరించింది. మౌలిక వసతుల కల్పనలో ప్రధాన అవసరమైన పారిశుధ్యం, తాగు, మురుగునీరు, వీధి దీపాలు, రోడ్ల నిర్వహణ, వరద నీటి కాలువలు, నాలాల అభివృద్ధి వంటి ప్రాథమిక అంశాలను పట్టించుకోకుండా, విభజన డ్రామాలతో కాలయాపన చేస్తోంది. గత ప్రభుత్వం నిర్మించిన ఆస్తులను కాపాడుకోలేక, కొత్తగా అభివృద్ధి చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ తీరుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.