Padma Rao Goud | బంజారాహిల్స్/సికింద్రాబాద్, ఏప్రిల్ 3: సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్రెడ్డి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి భూతద్దం పెట్టి వెతికినా కనిపించదని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశంలో పద్మారావు మాట్లాడారు. సికింద్రాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమంటూ.. గతంలో తాను మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలో ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నానో, ఇప్పుడు కూడా ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒకరికీ అందుబాటులో ఉంటానన్నారు. ప్రతి ఒక కార్యకర్త బాగా కష్టపడి బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. మార్పు తెస్తామంటూ..
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వందరోజుల్లోనే ప్రజలను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బస్తీల్లో మంచినీటి సమస్యలు, కరెంట్ కష్టాలు, అధికారుల వేధింపులు, కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెడితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లులు కట్టాలంటూ జలమండలి అధికారులు నోటీసులు ఇస్తున్నారన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పద్మారావుగౌడ్ను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. పార్టీలు మారే దానం నాగేందర్ వంటి వారిని చిత్తుగా ఓడించాలన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నా..ఏమాత్రం ఉపయోగం లేని కిషన్రెడ్డికి ఓటు ద్వారా గుణపాఠం నేర్పించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.