GO 111 | హైదరాబాద్ చుట్టపక్కల అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారిన జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి హరీశ్రావు మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు హరీశ్రావు ప్రకటించారు.
ఈ నిర్ణయంతో హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్నా భూములను వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు అనుమతిలేక ఇబ్బందిపడుతున్న ఆయా గ్రామాల ప్రజల కళ్లల్లో సంతోషం నింపింది. తెలంగాణ సర్కారు 111 జీవో పూర్తిగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఈ జీవో పూర్వపరాలను తెలుసుకుందాం. అసలు ఈ జీవోను ఎత్తివేయడం వల్ల ఎవరికీ లాభం కలుగుతుందో తెలుసుకుందాం.
హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. చాలా ఏండ్ల వరకు ఈ జలాశయాలే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాయి. కాగా, ఈ జలాశయాలను కలుషితం, కబ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి సర్కారు జీవో 111 తీసుకొచ్చింది. ఈ జీవో కారణంగా సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నది.
ప్రస్తుతం నగర తాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 జీవో ఉద్దేశ్యం సంబద్ధతను కోల్పోయింది. ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్ 111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది.
అదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ జలాశయాల ద్వారా తాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదిలేందుకు తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలోఉంటాయి. మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నగర పర్యావరణం మెరుగుపడుతుంది. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జీవో 111 కిందికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోని 84 గ్రామాలు వస్తాయి. ఇదంతా బయో కన్జర్వేషన్ జోన్గా ఉంది. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది దాదాపు జీహెచ్ఎంసీ విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని 1 లక్షా 32 వేల ఎకరాల భూములున్నాయి. నగరానికి చేరువలో మరో భాగ్యనగరం పట్టేంత విస్తీర్ణంలో భూములున్నా అలాంటి భూముల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టడంపై జీవో 111 ప్రకారం ఆంక్షలున్నాయి. ఇక్కడ వ్యవసాయేతర కార్యకలపాలపై నిషేధం ఉంది.
దీంతో ఇక్కడ అభివృద్ధికి అడ్డుకట్టపడింది. ఆయా గ్రామాల ప్రజలు మహానగరానికి దగ్గర ఉన్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయామని మనవేదన చెందుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేబినెట్ జీవో 111 పూర్తి ఎత్తివేతకు ఆమోదం తెలిపింది కేబినెట్. దీంతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగనున్నాయి. ఈ గ్రామాలు కూడా హైదరాబాద్లా అభివృద్ధి బాటపట్టనున్నాయి.