బేగంపేట్, మే 5 : కాంగ్రెస్, బీజేపీ నేతల మాయమాటలు, దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సికింద్రాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావుగౌడ్, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని రాంగోపాల్పేట్ డివిజన్లో వారు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మినిష్టర్ రోడ్డులోని సాయిబాబా ఆలయం నుంచి ప్రచారం ప్రారంభించి కాచ్బౌలి, వెంగళ్రావునగర్, నల్లగుట్ట సీ లైన్, ఎఫ్ లైన్, గైదిన్బాగ్, నల్లగుట్ట మసీదు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో అడుగడుగునా మంగళహారతులు, పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లేస్తే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని తెలిపారు. మాయమాటలు, దొంగ హామీల కాంగ్రెస్, బీజేపీను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి హోదాను పొందిన కిషన్రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా అందుబాటులో ఉండే వారు కాదని, అలాంటి వ్యక్తికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సుముఖంగా లేరని అన్నారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలు మరిచిపోయిందని పేర్కొన్నారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.