హిమాయత్నగర్, మార్చి 26 : తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి డా.దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్నగర్ డివిజన్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కింగ్కోఠిలోని ఈడెన్ గార్డెన్లో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా దాసోజు శ్రావణ్ హాజరై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో బీఆర్ఎస్కు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ముఖ్యంగా ఉద్యమాల గడ్డ.. చైతన్యానికి వేదికగా హిమాయత్నగర్ నిలుస్తుందన్నారు. బస్తీలు, కాలనీల్లో నివాసం ఉండే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారన్నారు. నగరం నాలుగువైపులా ప్రభుత్వం ఆధ్వర్యంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తుందన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధితో పాటు మౌలిక సదుపాయాలకు కోట్లాది రూపాయాలను ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగా పాల్గొని రాష్ర్టాన్ని సాధించుకున్నామో అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జె.హేమలతయాదవ్, బీఆర్ఎస్ పార్టీ హిమాయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు యాదగిరిసుతారి, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, నాయకులు బాబుయాదవ్, యతిరాజ్, డి.రాజేందర్కుమార్, పి.ప్రభాకర్గౌడ్, ఆర్.అశోక్కుమార్, నందు, సర్ఫరాజ్, ఎన్.గణేశ్ ముదిరాజ్, ఎన్.రాజేంద్ర ప్రసాద్, కృష్ణయాదవ్, పాలడుగు శ్రీనాథ్, కొల్కుల శ్రీకాంత్, మర్రికృష్ణ, దుగ్గిసాయి, మస్సూర్, సుదర్శన్, కళ, సయ్యద్ బిన్ ఖార్వన్, నవీన్బాబు, శ్రీకాంత్, సోయల్జాబ్రి, యాదగిరి, మురళీ, రామకృష్ణ, ఎక్బాల్ అత్తాస్, హజర్, చింటు, చంద్రశేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పక్షాలు చేసే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలంతా చూస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు మాత్రం అబద్ధాలను ప్రచారం చేస్తూ జనాన్ని గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటాం. ఆత్మీయ సమ్మేళనం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరింత ఆత్మీయత నెలకొంటుంది. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు అందిస్తాం. త్వరలోనే గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం.
– ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్