హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మారేడ్పల్లి ఎస్ఐపై కత్తి దాడి ఘటన తర్వాత పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎస్ఐ ఆపై ర్యాంక్ పోలీసు ఆఫీసర్లకు వెపన్ ఇవ్వాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హెడ్ క్వార్టర్స్లో ఉన్న వెపన్స్ని ఎస్ఐ ర్యాంక్ అధికారికి సైతం ఇవ్వాలని ఆదేశించారు.
నిన్న రాత్రి మారేడ్పల్లి ఎస్ఐ వినయ్ కుమార్పై పాత నేరస్తులు దాడి చేసి గాయపరిచిన సంగతి తెలిసిందే. ఇటీవల మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యపై కూడా చైన్ స్నాచర్లు దాడి చేశారు. ఈ దాడుల నేపథ్యంలో పెట్రోలింగ్ టైంలో నేరగాళ్ల నుంచి రక్షణ పొందేందుకు గన్స్ ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇప్పటికే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రతి ఎస్ఐ వెపన్ క్యారీ చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్పై వస్తున్న ఇద్దరిని ఎస్ఐ ఆపి ప్రశ్నించారు. అయితే వారిలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్ఐ వినయ్కుమార్ కడుపులో పొడిచాడు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐని సిబ్బంది సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, వారంరోజుల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. దొంగల పట్టుకునేందుకు మఫ్టీలో మాటువేసిన సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, గిరిపై దుండగులు కత్తిలో దాడిచేశారు. ఈ దాడిలో హెడ్కానిస్టేబుల్ యాదయ్య తీవ్రంగా గాయడ్డారు. ప్రస్తుతం ఆయన దవాఖానలో చికిత్స పొందుతున్నారు.