మలక్పేట, డిసెంబర్ 6 : హైదరాబాద్ జిల్లా పరిధిలోని దివ్యాంగుల వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని దివ్యాంగుల వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత మూడురోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులు, డైరెక్టర్ శైలజతో కలిసి మంగళవారం దివ్యాంగుల సంక్షేమశాఖ భవన్లో సమావేశమై సమస్యలపై ఆయన చర్చలు జరిపారు.
వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ కేంద్రాలు, అర్హులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు, 4జీ స్మార్ట్ ఫోన్లు, స్కిల్ డెవలెప్మెంట్ శిక్షణ కేంద్రాలు, పర్మినెంట్ వసతి గృహాలు, మెట్రో, బస్పాస్లు, సదరం సర్టిఫికెట్లలో ఉన్న లోపాలను సవరించటం వంటి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు చైర్మన్, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క వినతిపత్రం ఇస్తేచాలు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీలు రాజగోపాల్, రాజేందర్, సంఘాల ప్రతినిధులు ముత్తినేని వీరయ్య, నారా నాగేశ్వర్రావు, శ్రీశైలం, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.