హిమాయత్నగర్,జనవరి31: రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నారాయణగూడలోని బాప్టిస్టు చర్చిలో తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్, పాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా క్రైస్తవుల సమస్యలు పరిష్కారం కాలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీలందరూ ఐక్యతతోనే అభివృద్ధి సాధించగలమనే విషయాన్ని గుర్తించి సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. కైస్తవుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. క్రిస్టియన్ల ఆత్మగౌరవం పెంచేందుకు ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల భూమి, రూ.10 కోట్లతో క్రిస్టియన్ భవనం నిర్మాణం కోసం నిధులు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రభుత్వం అందించే స్వయం సమృద్ధి పథకాలు, సబ్సిడీలను క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మైనార్టీ కార్పొరేషన్ నుంచి నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో అనేక చోట్ల కులాలు, మతాల పేరుతో రాజకీయాలు జరుగుతు న్నాయని, రాష్ట్రంలో అలాంటి వాటికి చోటులేదని, శాంతి భద్రతల నిర్వహణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఏఓ సామేల్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ తిమోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాల్మాన్రాజ్, ఉపాధ్యక్షుడు జోయల్, నాయకులు రాజా, రిచర్డ్, సురేశ్ మనోహరన్, బిషప్ ఆశీర్వాదం, పురుషోత్తం,హేమలత, అనిల్ కుమార్, స్రవంతి పాల్గొన్నారు.