ఎల్బీనగర్ : వరద ముంపు నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని, ముంపు ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా నివారిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం గులాబ్ తూఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ చెరువు దిగువన ఉన్న గడ్డి అన్నారం డివిజన్ కోదండరాంనగర్ కాలనీ, సీసలబస్తీల్లో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి , ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో సమగ్ర నాలా అభివృద్ది కార్యక్రమంలో భాగంగా వరదనీటి నాలాలు, డ్రైయిన్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ముంపు నివారణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. తూఫాన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదనీరు, డ్రైయిన్స్ సాఫీగా వెళ్లేలా సదరు డ్రైయిన్స్ను వెడల్పు చేస్తున్నామన్నారు.
ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, డ్రైయిన్స్, నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని సూచించారు. డ్రైయిన్స్ క్లీన్ చేస్తున్న సమయంలో పెద్ద పెద్ద దుంగలు, ప్లాస్టిక్ సంచులు, డ్రమ్ములు, ఇతర వ్యర్థాలు వస్తున్నాయని , ఇలా చేయడం తో వరదనీరు సాఫీగా వెళ్లకుండా రోడ్లపై పొంగుతూ నివాసాల్లోకి వెళ్తుందన్నారు.
సరూర్నగర్ ఔట్లెట్ నుండి డివిజన్ జోనల్ కార్యాలయం మీదుగా చైతన్యపురి బ్రిడ్జ్ వద్ద మూసీ నాలాకు నూతన డ్రైయిన్ నిర్మాణం పూర్తయితే వరదనీటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్కుమార్, మాజీ కౌన్సిలర్లు కందికంటి ప్రేంనాథ్గౌడ్, రమేష్ ముదిరాజ్, రమణారెడ్డి, శ్రీధర్, కిరణ్, యాద శంకర్, విక్కి తదితరులు పాల్గొన్నారు.