సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర సర్కారు కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ అన్నారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకం ఫిబ్రవరి నెల నుంచే ప్రారంభం కావడంతో ఈ ప్రాంత ప్రజలకు నీటి బిల్లుల చెల్లింపు సమస్య తీరినట్లేనని చెప్పారు.
ఈ మేరకు మంగళవారం బోర్డు పరిధిలోని రెండో వార్డు రసూల్పురాలో ఉచిత తాగునీటి పథకం అమలు కావడంపై స్థానికులు కృతజ్ఞత పూర్వక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు కంటోన్మెంట్కు ఉచితంగా తాగునీటిని అందిస్తున్నారని చెప్పారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచే ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా అమలులోకి వచ్చిందని తెలిపారు. దీంతో సర్కారుపై ఏడాదికి రూ.18కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. రాష్ట్ర సర్కారు ముందుచూపుతో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, కానీ ఈ ప్రాంత సమస్యలను తెలుసుకోకుండా, పరిష్కరించకుండా కేంద్రం మొద్దునిద్రపోతుందని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత తాగునీటి పథకం అమలు చేయడం ఆనందంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘు, కళ్యాణ్ సందీప్, త్రివేద్, సూరజ్తో పాటు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.