ఎల్బీనగర్, ఆగస్టు 31 : వినాయక నవరాత్రి ఉత్సవాలకు, నిమజ్జనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య అన్నారు. మంగళవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద వినాయక ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో ఉప కమిషనర్తో పాటుగా పోలీస్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్ హరి కృష్ణయ్య మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనోత్సవాలకు సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్ను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
బండ్పై అన్ని మరమ్మతులు చేయడంతో పాటుగా రోడ్లపై గుంతలను పూడ్చివేయించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో ఉత్సవాలను జయప్రదం చేస్తామన్నారు.
వినాయక ఉత్సవాలను శాంతియుతంగా ఘనంగా జరుపుకోవాలని ఎల్బీనగర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీధర్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, కార్యదర్శి రావినూతల శశిధర్, వీహెచ్పీ నాయకులు రామరాజు, సరూర్నగర్ సీఐ సీతారాం, గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్లు బద్దం ప్రేం మహేశ్వర్రెడ్డి , సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ , సైదాబాద్ కార్పొరేటర్ అరుణ, సీనియర్ నాయకుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.