ముషీరాబాద్/చిక్కడపల్లి : డ్రగ్స్ సరఫరా చేసే వారితోపాటు వినియోగించే వారిని వదిలిపెట్టేది లేదని నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలు, డ్రగ్స్ అలవాటు పడిన వారిని పట్టుకొని జైలుకు పంపడంతోపాటు అక్కడి నుంచి భయటికి వచ్చిన తరువాత రిహాబిటేషన్ సెంటర్లకు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు వారి కదలికలపై నిఘా కొనసాగించనున్నట్లు తెలిపారు.
సోమవారం బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణమండపంలో ఆరోరా కాలేజ్, అంబేద్కర్ కాలేజీలు, చిక్కడపల్లి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం, దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహణ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కమిషనర్ విద్యార్థులనుద్దేశించిన ప్రసంగించారు.
ప్రపంచ మేటి నగరాల్లో ఒక్కటైన హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా అదుపు చేయకపోతే ప్రమాదం ఏర్పడే అకాశం ఉందని, పోలీసులు, యువత, మేధావులు కలిసి డ్రగ్స్కు ముగింపు ఫలుకుదామంటూ పిలుపునిచ్చారు. డ్రగ్స్ సరఫరా చేసే వారితోపాటు వినియోగించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని అన్నారు.
ఇప్పటి వరకు గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తున్న వారు మారుతారేమోనని కౌన్సిలింగ్ చేసి వేచి చూశామని, కౌన్సిలింగ్ తరువాత కూడా మారని వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవస్థను పారదోలడానికి సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని, హైదరాబాద్ పోలీసులు రెండు రకాల ప్రత్యేక పోలీసు వ్యవస్థలతో డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్టవేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ బృందాలు డ్రగ్స్ను నియంత్రించడానికి సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. త్వరలో పోలీసుస్టేషన్ల వారిగా అధికారులు, పోలీసులు సిబ్బంది బస్తీలు, కాలనీల్లో పర్యటించి డ్రగ్స్ వినియోగం, దుష్పరిణామాలపై అవగాహణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
కాలేజీల్లో విద్యార్థులకు, బస్తీల్లో తల్లిదండ్రులకు అవగాహణ కల్పించడం జరుగుతుందన్నారు. డ్రగ్స్కు బానిసలైన పలువురు సంపన్నుల పిల్లల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, విద్యార్థుల వ్యవహర శైలిపట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్త వహించి డ్రగ్స్ వైపు మళ్లకుండా చూసుకోవాలని కోరారు.
డ్రగ్స్ సరఫరా, అమ్మకాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే బాధ్యతతో వెంటనే స్థానిక పోలీసులు, నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించాలని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర కోరారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పని చేస్తున్న నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ టీంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అరోరా విద్యా సంస్థల కార్యదర్శి నిమ్మటూరి రమేశ్ బాబు, ఆకెల రాఘవేంద్ర, డాక్టర్ జయరామిరెడ్డి, డాక్టర్ జవహర్లాల్ నె,్ర చిక్కడప్లి ఏసీపీ శ్రీధర్, సీఐ సంజయ్, కళాశాల ప్రిన్సిపాల్ విశ్వానాథం తదితరులు పాల్గొన్నారు.