CP Srinivas Reddy | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ నిర్మూలనకు పాఠశాలల్లో కమిటీలు వేస్తామని, వాటికి త్వరలోనే పేరును నిర్ణయిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్’ పేరుతో మాదకద్రవ్యాల నిర్మూలనపై హైదరాబాద్ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ ఆడిటోరియంలో స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు అంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండీల్య మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నిరోధించడం ఒక పోలీసుల బాధ్యత మాత్రమే కాదని..ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.
‘పాఠశాలలు, కాలేజీల వరకు డ్రగ్స్ మహమ్మారి చేరుకుంది..ఇది మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి’ అని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి మాట్లాడుతూ మానవ సమాజానికి డ్రగ్స్ అనేది అత్యంత ప్రమాదకరమైందన్నారు. రాచకొండ కమిషనర్ తరుణ్జోషి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడే అవకాశముందన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ దేవాసేన తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు అంతా కలిసికట్టుగా కృషి చేయాలి. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం.