ఎల్బీనగర్, జూలై 2 : ఎల్బీనగర్ ఇన్నర్ రింగ్రోడ్డులో అలుకాపురి, సాయినగర్ వద్ద మరో నూతన ఫ్లై ఓవర్ నిర్మాణం చేయిస్తామని, రాజీవ్గాంధీనగర్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్బీనగర్లోని కుషాల్ కన్వెన్షన్లో కొత్తపేట డివిజన్లోని సౌత్ కాలనీలు ఆర్టీసీ కాలనీ, శివగంగా కాలనీ, శ్రీశివగంగా కాలనీ, శ్రీనివాస్ కాలనీ, శివశంకర్కాలనీ, శివమ్మ నగర్, రాజీవ్గాంధీనగర్ ఫేజ్-1, 2, భరత్నగర్, అంబేద్కర్నగర్, న్యూ నాగోలు, స్నేహపురి కాలనీల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నర్ రింగ్రోడ్డులో ప్రస్తుతం నిర్మించిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్లతో ప్రయాణం సాఫీగా సాగుతోందని..
అలుకాపురి జంక్షన్ ప్రాంతం సమస్యను కూడా పరిష్కారం చేసేందుకు నూతన ఫ్లై ఓవర్ నిర్మాణం చేయనున్నామన్నారు. నాగోలు బ్రిడ్జి ప్రాంతం వరకు ఉన్న మెట్రో రైలు కూడా త్వరలోనే ఎల్బీనగర్ జంక్షన్ వరకు పొడిగించడం జరుగుతుందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ప్రతి నిత్యం కార్యాలయంలో వందలాది మంది కాలనీ, బస్తీవాసులతో మాట్లాడి సమస్యలు విన్నా అన్ని కాలనీల వాసులతో స్వయంగా మాట్లాడాలన్న ఉద్దేశంతో తాను కాలనీలవాసులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి స్వయంగా వారి సమస్యలను వింటున్నానన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు వెయ్యి కాలనీల వరకు ఉన్నాయని అన్ని కాలనీలను దాదాపుగా తిరిగేందుకు మార్నింగ్ వాక్ పేరుతో పర్యటిస్తున్నామన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సుమారు ఇద్దరు ఎమ్మెల్సీలు, తన నిధులు కలిపి సుమారు రూ.7కోట్లను వెచ్చించామని, వీటిలో సుమారు 70 కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయన్నారు.
దీనికి తోడుగా ప్రభుత్వం నుంచి మరో రూ.30కోట్లు కేటాయించాలని కోరడం జరిగిందని తెలిపారు. కొత్తపేట డివిజన్ సౌత్ కాలనీల్లో ప్రధానంగా డ్రైనేజీ, వాటర్ లైన్లు లీకై నీటి కాలుష్యం ఏర్పడిన విషయాన్ని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, వదర నీటి సమస్యలు ఉన్నాయని, కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం చేయాలని, ఒపెన్ నాలాలపై స్లాబ్ వేయాలని, అంతర్గత రోడ్లు వేయాలని తన దృష్టికి కాలనీలవాసులు తెచ్చారని, అన్ని సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేస్తామన్నారు. ప్రజలతో మమేకమై వారి సాదకబాదకాలు విని పరిష్కారం చేయడమే తన ధ్యేయమన్నారు. తాను ఎన్నికల కోసం అభివృద్ధి చేయడం లేదని భవిష్యత్తు తరాల కోసమే తన తపన అన్నారు. బీఆర్ఎస్ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల రాజారెడ్డి, కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, జోగు రాములు, మహేశ్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వేశ్వర్రావు, బొగ్గారపు వరుణ్ చంద్ర, రాగిరి ఉదయ్ గౌడ్, పాండు గౌడ్, రమావత్ దీప్లాల్, మల్లెపాక యాదగిరి, ఇటిక్యాల యాదగిరి, యాసిన్తో పాటు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నాం
వనస్థలిపురం, జూలై 2 : ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం వనస్థలిపురం కాలనీ సంక్షేమ సంఘాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజీ లేకుండా పనిచేస్తున్నామన్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఎల్బీనగర్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీగా చేశామన్నారు. ప్రధాన, అంతర్గత రహదారులను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయని తెలిపారు.
నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని కాలనీలకు తాగునీరందిస్తున్నామన్నారు. అవకాశమున్న ప్రతీ చోట పార్కులు, ఆట స్థలాలను నిర్మించామని, నియోజకవర్గంలో ఇప్పటికే రెండు స్విమ్మింగ్ పూల్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చాలా కలనీల నుంచి సీసీ కెమెరాల కోసం విజ్ఞప్తులు వచ్చాయని వాటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అధికంగా నిధులు తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రజలంతా అభివృద్ధికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్, కుంట్లూర్ వెంకటేశ్గౌడ్, చాపల శ్రీనివాస్ యాదవ్, అజయ్ యాదవ్, గడల రాజు, వేములయ్య గౌడ్, మధు గౌడ్, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.