హైదరాబాద్ : అనాథ పిల్లలకు(Orphan children) అండగా ఉండాలని, సామాజిక బాధ్యతగా వారిని సంరక్షించాలని ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానం కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న చైల్డ్, అనాథశ్రయాలు, శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉండే చిన్నారులకు జారీ చేసిన కుల(Caste), ఆదాయ, బర్త్, ఆధార్(Aadhar) కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దల సంరక్షణ లేక, కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎంతోమంది చిన్నారులకు ప్రభుత్వ ధృవీకరణ పత్రాలను తీసుకోవడం అత్యంత క్లిష్టతరమని అన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో వారికి గుర్తింపు, ధృవీకరణ పత్రాలను జారీ అభినందనీయమని పేర్కొన్నారు . ఏ తోడు లేకున్నాగాని ప్రభుత్వం, సమాజం తోడుంటూ వీరిని ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది అభాగ్యులకు ఈ తరహా స్పెషల్ డ్రైవ్(Special Drives) లతో విద్యా, ఉద్యోగాలకు అవసరమైన ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేందుకు వీలు ఉంటుందన్నారు.
అనాథ సంరక్షణకు ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను గుర్తించి చైల్డ్ కేర్ సెంటర్ల్లో చేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఇదీ అందరీ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎన్జీజీవోలు, చైల్డ్ కేర్ సెంటర్లతోపాటు, మహిళ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని శిశు విహార్ అధికారులు పాల్గొన్నారు.