జీడిమెట్ల, అక్టోబర్ 8 : ముస్లిం మైనార్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వారంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం చింతల్ డివిజన్ పరిధి రోడామేస్త్రినగర్-ఎ లో నూతనంగా నిర్మించనున్న ఈద్గా, ముస్లిం శ్మశాన వాటిక నిర్మాణ పనులకు, బాచుపల్లిలో ఈద్గా, ముస్లిం శ్మశాన వాటిక నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో కలిసి శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటికలో మొక్కలు నాటిన అనంతరం గాజులరామారంలోని మహరాజ గార్డెన్లో ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ముస్లిం, మైనార్టీ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గత పాలకులు ముస్లిం మైనార్టీలను ఓటర్లుగా మాత్రమే చూసే వారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేద ముస్లిం ఆడ బిడ్డల వివాహానికి షాదీముబాకర్ పథకం ద్వారా రూ.1,00116 అందజేస్తున్నారని చెప్పారు. మౌజం, ఇమామ్లకు ప్రతి నెల వేతనాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. నిరుపేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బట్టలను పంపిణీ చేస్తుందన్నారు.
పేద ముస్లిం విద్యార్థులకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి మీద రూ.లక్షా 25వేలు ఖర్చు చేస్తుందని తెలిపారు. పోలీస్ శాఖలో 33శాతం మహిళా రిజర్వేషన్ల కోటను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేయలేని అభివృద్ధి సంక్షేమ పథకాలను తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజు యాదవ్, కమిషనర్ రామకృష్ణరావు, కార్పొరేటర్లు బాలాజీనాయక్, ముస్లిం, మైనార్టీ నాయకులు మహమ్మద్ మక్సూద్ అలీ, డాక్టర్ హుస్సేన్, మీర్జా రశీద్బేగ్, యూసుఫ్, అబ్దుల్ ఖాదర్, ఫిరోజ్, సిద్దిక్, కో అప్సన్ సభ్యులు సయ్యద్ సలీం, ఖలీల్ అహ్మద్, నబి షర్పితో పాటు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.