సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ) : బల్దియా ఆధ్వర్యంలో అమలవుతున్న మౌలిక వసతులు, రవాణా, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, యూబీడీ, చెరువుల నిర్వహణ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ బృందం రెండు రోజుల పర్యటన కోసం నగరానికి వచ్చింది. శుక్రవారం హోటల్ తాజ్ కృష్ణలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా, బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, వివిధ విభాగాల హెచ్వోడీలు హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పథకాలను కమిటీ సభ్యులకు వివరించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని, మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎస్ఆర్డీసీ ద్వారా రోడ్ నెట్ వర్ను, నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్లు మేయర్ వివరించారు.
ఎస్ఆర్డీపీలో 48 పనులు చేపట్టగా, 33 పనులు పూర్తయ్యాయని, మిగతావి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికారులు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. సీఆర్ఎంపీ ద్వారా సుమారు 800 కిలోమీటర్ల మెయిన్ రోడ్డు సమర్థవంతంగా నిర్వహణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ కమిటీ చైర్మన్ సౌరబ్ భరద్వాజ ఆధ్వర్యంలో సభ్యులు ఆజేశ్ యాదవ్, అఖిలేశ్ తదితరులు, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్లు బి.సంతోష్ శృతి ఓజా, ప్రియాంక అలా, జయరాజ్ కెన్నెడీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు సంజీవయ్య పార్కు వద్ద ఉన్న ఎస్టీఅండ్సీపీ, జవహర్నగర్ డంపింగ్ యార్డును పరిశీలించారు.