సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : నీటి సంక్షోభం తలెత్తకూడదంటే పొదుపుగా నీటి వాడకంతో పాటు శుద్ధి చేసిన నీరు పునర్వియోగం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. నీరు, పారిశుధ్యంలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్పును వేగవంతం చేయుట అనే ప్రధానాంశంతో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎండీ దానకిశోర్ హాజరయ్యారు. హైదరాబాద్ మహానగరంలో 99.16 శాతం మంది ప్రజలు జలమండలి సరఫరా చేస్తున్న నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయం స్వయానా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని వెల్లడించారు. ఈ జూలై నాటికి దేశంలోనే వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే జలమండలి వాటర్ డిజెస్ట్ మ్యాగజైన్ ప్రభుత్వ విభాగంలో ఉత్తమ ఎస్టీపీ అవార్డు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత సాధించడంలో ముఖ్య పాత్ర పొషించిన ఇంజినీర్లు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ప్రజలకు నీటి విలువ తెలియజేసేలా రూపొందించిన కరపత్రాలను బోర్డు డైరెక్టర్లతో కలిసి ఎండీ ఆవిష్కరించారు. ప్రచార వాహనాలను ఈడీ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, శ్రీధర్ బాబు, వీఎల్ ప్రవీణ్కుమార్, స్వామి, రవికుమార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఓఎస్డీ సత్యనారాయణ, బ్రహ్మకుమారీలు అంజలీ దేవి, దీదీ శోభాదేవి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, ఎన్జీవోల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.