సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 7 (నమస్తే తెలంగాణ): సరిగ్గా పదేండ్ల కిందట భాగ్యనగర వాసులు గుక్కెడు నీటికోసం అలాడిపోయారు. ఖాళీ బిందెలతో రాత్రింబవళ్లు నిరీక్షించి.. సికపట్టు యుద్ధాలు పట్టారు. చేసేదిలేక అప్పటి సర్కార్ చేతులెత్తేయడంతో చాలీచాలని నీటితో ప్రజలు కాలం నెట్టుకొచ్చారు. ఉమ్మడి పాలనలో హైదరాబాద్ దుస్థితి ఇది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పరిస్థితులు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితంగా ఆడబిడ్డలు ఖాళీ బిందెలతో రోడ్లమీదకు రావడమే మానేశారు. హైదరాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి తాగునీటి పథకాలు రూపొందించి.. నదుల నుంచి నగరానికి వందల కిలోమీటర్ల పైపులైన్లు వేసి పట్నం ప్రజల దాహం తీర్చారు. ఇంతటి వర్షాభావంలోనూ హైదరాబాద్ నలుమూలలా మంచినీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పుణ్యమా అని ఇంటింటికి గోదావరి జలాలు పరుగు పెడుతూ ప్రతి గడపను ముద్దాడుతున్నాయి.
హైదరాబాద్ మహా నగరానికి సరఫరా అవుతున్న మంచినీటిలో గోదావరిజలాల పాత్ర అత్యంత కీలకం. గోదావరిజలాల తరలింపు పథకం ద్వారా రోజుకు 172 మిలియన్ గ్యాలన్ల జలాలను తరలించి.. వివిధ దశల్లో శుద్ధి చేసి నగరవాసులకు అందిస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రూపొందించిన ఈ పథకం పూర్తిగా ఎల్లంపల్లి జలాశయంపైనే ఆధారపడి డిజైన్ చేశారు. ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం-ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్లు (485.56 అడుగులు) కాగా నిల్వ సామర్థ్యం 21.18 టీఎంసీలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తాగునీటి కోసం రూపొందించిన పథకంలో ఎండీడీఎల్ (మినిమం డ్రాడౌన్ లెవల్-నీటిని సేకరించే కనీస నీటిమట్టం) 142 మీటర్లు (465.87 అడుగులు)గా నిర్ధారించారు. అంటే.. జలాశయంలో కనీసం 142 మీటర్ల మేర నీటిమట్టం ఉంటేనే హైదరాబాద్కు తాగునీటి సరఫరా జరుగుతుంది. ఒకవేళ వర్షాలు ఆలస్యమై ఎగువ నుంచి వరద రాకపోతే?! పైగా ఈ జలాశయం నుంచి స్థానిక తాగునీటి అవసరాలతో పాటు కీలకంగా ఎన్టీపీసీ, రామగుండం థర్మల్ పవర్ స్టేషన్కు కూడా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. దీంతో పాటు ఈ జలాశయం కింద సాగును కూడా జోడించారు. ఇంత కీలకమైన జలాశయం అయినప్పటికీ, రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలు ముడిపడి ఉన్నప్పటికీ గత పాలకులు భరోసా ఇన్ఫ్లో కోసం ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు.
చేతులెత్తేసిన గత ప్రభుత్వాలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. వర్షాకాలం సీజన్ మొదలై నెల రోజులు దాటినప్పటికీ ఎగువన మహారాష్ట్రలోగానీ తెలుగు రాష్ర్టాల్లోగానీ సరైన వర్షాలే కురవలేదు. దీంతో ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి దేవుడెరుగు.. స్థానిక పరివాహకం నుంచి కూడా వరద ఎల్లంపల్లి జలాశయానికి రావడం లేదు. కానీ కాళేశ్వరం ద్వారా నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసి నిల్వ తగ్గకుండా చూస్తున్నారు. వాస్తవానికి గతంలోనైతే.. ఇలాంటి పరిస్థితుల్లో మహా నగర నీటి సరఫరా అనేది దినదిన గండంలా మారేది. ఎల్లంపల్లిలో ఎండీడీఎల్ దిగువన నీటిమట్టం పడిపోయి.. అత్యవసర మోటార్లు అంటూ హడావుడి మొదలయ్యేది. అదీ అవసరాలకు సరిఫడ నీటిని అందించక.. రోజూ నగర మంచినీటి సరఫరాలో భారీ కోతలు ఉండేవి. మరోవైపు ఎలాగూ వర్షాభావంతో నగరంలోనూ వర్షాలు లేక బోర్లు అడుగంటేవి. తద్వారా మహా నగరంలో మంచినీటి యుద్ధాలు, ట్యాంకర్ల వద్ద గొడవలు నిత్యకృత్యంగా మారేవి. వరుణుడు కరుణించడం లేదు.. అంటూ ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసేవి.
శ్రీరామరక్షగా కాళేశ్వరం
తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక అడ్డంకులను తొలగించి త్వరితగతిన గోదావరి మంచినీటి పథకాన్ని పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం మరోవైపు వర్షాభావంలోనూ ఎల్లంపల్లి నిల్వలకు ఢోకా లేకుండా… తద్వారా హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా భరోసా కల్పించింది. సాగు, ఇతరత్రా అవసరాలకు నీటిని వదులుతూనే.. ఎండాకాలంలోనూ కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లిలో నిల్వ తగ్గకుండా చర్యలు తీసుకుంటుండటంతో ఏడాది పొడవునా జలాశయంలో కనీసంగా 144 మీటర్ల మేర నిల్వలు ఉంటున్నాయి. ఈ ఏడాది కూడా అదే చేశారు. తీవ్ర వర్షాభావంలోనూ ప్రాణహిత నుంచి ఎంతోకొంత వరద వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రధాన గోదావరి, స్థానిక పరివాహకం నుంచి వరద రానప్పటికీ ప్రాణహితలో వస్తున్న వరదను ఎప్పటికప్పుడు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తూ ఎల్లంపల్లికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎల్లంపల్లిలో 144 మీటర్ల ఎగువన నీటిమట్టంతో 12 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ తాగునీటి కోసం రోజుకు 331 క్యూసెక్కుల కాళేశ్వరజలాల్ని డ్రా చేస్తూనే ఉన్నారు. జలాశయం నుంచి ఎన్టీపీసీ, రామగుండంతో పాటు మిషన్ భగీరథకు కూడా నీటిని అందిస్తున్నారు. వీటికి మించి ఇక్కడి నుంచి ఒకవైపు ఎస్సారెస్పీ, మరోవైపు శ్రీరాజరాజేశ్వరం (మిడ్ మానేరు) జలాశయానికి కూడా నీటిని అందిస్తున్నారంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కరువు ఛాయలు అనేవి ఉండవనే సీఎం కేసీఆర్ హామీ మరోసారి రుజువైంది.