సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అందిస్తున్న సేవలు అద్భుతమని చెన్నై వాటర్ బోర్డు అధికారులు కొనియాడారు. తమిళనాడు నుంచి ముగ్గురు అధికారులతో కూడిన బృందం జలమండలి అందిస్తున్న సేవలు, మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణలో అవలంభిస్తున్న పద్ధతులు, సాంకేతిక వినియోగం, రెవెన్యూ అంశాల గురించి అధ్యయనం చేసేందుకు శనివారం హైదరాబాద్కు వచ్చింది. వీరిలో ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ మురుగానందం, చెన్నై వాటర్ బోర్డు ఎండీ కిర్లోష్ కుమార్, చీఫ్ ఇంజినీర్ రామస్వామి ఉన్నారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్ వారికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా..
జలమండలి అందిస్తున్న సేవలు, చేపట్టిన సంసరణలను ఎండీ దానకిశోర్ తమిళనాడు బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. హైదరాబాద్తో పాటు ఓఆర్ఆర్ వరకు అందిస్తున్న తాగునీరు, మురుగు నీటి శుద్ధి ప్రక్రియ, ఎస్టీపీల నిర్మాణం, ఇందులో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికత, సామగ్రి, జెట్టింగ్ మిషన్, సివర్ క్రాక్ మిషన్ వంటి వివిధ యంత్రాల పనితీరును తెలియజేశారు. అలాగే..ఐటీ విభాగంలో తీసుకువచ్చిన డిజిటల్ మానిటరింగ్, మాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్స్ (ఎస్పీటీ), జలమండలి రూపొందించిన యాప్ల పనితీరు గురించి వివరించారు. కార్మికుల భద్రతా చర్యల్లో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం అవలంభిస్తున్న పద్ధతులు, పని చేసే సమయంలో కార్మికులకు అందజేసే పరికరాలు, బీమా సౌకర్యం తదితర వివరాల గురించి తెలిపారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యం : ఎండీ దానకిశోర్
సీఎం కేసీఆర్ ముందు చూపు, పురపాలక మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంతో ఇవన్నీ సాధ్యమయ్యాయని జలమండలి ఎండీ దానకిశోర్ పేరొన్నారు. దేశంలోనే మానవ రహిత పారిశుధ్య పనుల్లో ప్రధాని కార్యాలయం నుంచి ప్రశంసలు అందుకున్నదన్నారు. తమిళనాడు అడిషనల్ సీఎస్ మురుగానందం మాట్లాడుతూ.. జలమండలి అనుసరిస్తున్న మానవ రహిత మురుగు శుద్ధి విధానాలు ఇతర నగరాలకు ఆదర్శమన్నారు. చెన్నై వాటర్ బోర్డు ఎండీ కిర్లోష్ కుమార్ మాట్లాడుతూ.. జలమండలి ఐటీ విభాగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, తదితర వాటిల్లో తీసుకొచ్చిన సంసరణలను ప్రశంసించారు. చెన్నైలో సైతం వీటిని అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ముందుకు సాగిన బృందం
తమిళనాడుకు చెందిన అధికారుల బృందం తొలుత జలమండలి ఓ అండ్ ఎం డివిజన్-6, ఎస్.ఆర్.నగర్లో పర్యటించింది. ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ సెవర్ క్రాక్ టెక్నాలజీ గురించి వారికి వివరించారు. అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 51 లో, మాదాపూర్ పరిధిలో పర్యటించి ఏఎంఆర్ మీటర్ల పనితీరును తెలుసుకున్నారు. అధికారుల బృందం వెంట ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్, ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, సీజీఎంలు, అధికారులు పాల్గొన్నారు.
అధ్యయన కేంద్రంగా జలమండలి ..
జలమండలి విధానాలు, పనితీరును అధ్యయనం చేయడానికి ఇతర నగరాల నుంచి అధికారులు వరుస కడుతున్నారు. 2021 ఫిబ్రవరిలో 22 మందితో కూడిన ఏపీ అధికారుల బృందం వచ్చింది. మార్చిలో ట్రైనీ ఐఏఎస్ అధికారులు వచ్చారు. గతేడాది ఢిల్లీ జల్ బోర్డు అధికారులు రెండు సార్లు సందర్శించారు. ఈ ఏడాది తమిళనాడు నుంచి అధికారులు వచ్చి అధ్యయనం చేయడం విశేషం. వీరితో పాటు అధ్యయనం చేయడానికి నిత్యం ఇతర రాష్ట్రాల శిక్షణలో ఉన్న ఐఏఎస్లు, అధికారులు జలమండలిని సందర్శిస్తున్నారు. ఇది బోర్డు చేస్తున్న కృషికి అద్దం పడుతున్నదని జలమండలి అధికారులు పేర్కొన్నారు.