Hyderabad | సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. గురువారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించి సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సమయంలో కలుషితనీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎండీ అధికారులకు సూచించారు. తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. తరచూ సీవరేజీ ఓవర్ఫ్లో అయ్యే మ్యాన్హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఎండీ చెప్పారు. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. మ్యాన్హోళ్ల మూతలు తెరవడం జలమండలి యాక్ట్లోని 74వ సెక్షన్ ప్రకారం నేరమని, అతిక్రమిస్తే.. క్రిమినల్ కేసులు నమోదవుతాయని ఎండీ హెచ్చరించారు. ఎక్కడైనా మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
మ్యాన్హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు
ఇప్పటికే 22వేలకు పైగా మ్యాన్హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు ఎండీ తెలిపారు. లోతు ఎక్కువ ఉన్న మ్యాన్హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, జీహెచ్ఎంసీ వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. తీసిన వ్యర్థాలను (సిల్ట్) వెంటనే తొలగించాలని, తాగునీటి పైపులైన్ నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. ముంపునకు గురైన మ్యాన్హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో ఈఆర్టీ బృందాలు, వాహనాలు
వర్షాల నేపథ్యంలో నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసిందని, ఒక్కో బృందంలో ఐదుగురు సిబ్బందితోపాటు ఇతర అత్యవసర సామగ్రి ఉంటుందన్నారు. నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వాహనాల్లో జనరేటర్తో కూడిన డీవాటర్ మోటర్ ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆరు ఎస్పీటీ వాహనాలు, మరో 16 మినీ ఎయిర్టెక్ వాహనాలను 24 అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
మ్యాన్హోళ్లకు జియో ట్యాగింగ్
ఎక్కడ వర్షపు నీరు నిలుస్తుంది, ఆ నీరు వెళ్లేందుకు మ్యాన్హోల్స్ ఎక్కడున్నాయి.. రోడ్లపై నిలిచిన నీళ్లు బయటకు వెళ్లేందుకు మార్గాలేమిటీ అనే విషయాలు సిబ్బందికి అవగాహన ఉండేలా నగర ట్రాఫిక్ పోలీసులు టెక్నాలజీని వాడుతున్నారు. అయితే వర్షాకాలంలో ట్రాఫిక్ రద్దీకి వాటర్ లాగింగ్ పాయింట్లు ప్రధాన కారణమవుతాయి. ఇందుకు వాటర్ లాగింగ్ పాయింట్స్, అక్కడ ఉండే మ్యాన్హోళ్లకు జియో ట్యాగింగ్ చేశారు. రోడ్లపై విరిగిపడ్డ చెట్లను ఎప్పటికప్పుడు తొలగించారు.
వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం
భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా పలు ఐటీ, ఐటీయేతర సంస్థలు తాత్కాలికంగా వర్క్ఫ్రమ్ హోం సౌకర్యాన్ని తమ ఉద్యోగులకు ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. మరో రెండురోజులు భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ప్రైవేట్ సంస్థలు కూడా సెలవులు ప్రకటించేలా కార్మిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అవకాశమున్న పలు ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జంట జలాశయాల్లోకి పైనుంచి వరద
విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లలోకి వరదనీరు చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి వరద తాకిడి గురువారం సాయంత్రం నుంచి మొదలైంది. ఉస్మాన్సాగర్లోకి 500 క్యూసెక్కులు, హిమాయత్సాగర్లోకి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నది. వరద తాకిడి అంచనాకు అనుగుణంగా గేట్లు ఎత్తివేతకు జలమండలి అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
సమన్వయంతో పనిచేస్తున్నాం
వర్షం కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా చర్యలు తీసుకు న్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగాలు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చర్యలు తీసుకున్నాం. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఒక చోట ఎదైనా సమస్య వస్తే అది ఆ రూట్ మొత్తంపై ప్రభావం చూపుతుంది.
– సుధీర్బాబు, నగర ట్రాఫిక్ అదనపు సీపీ