బంజారాహిల్స్, అక్టోబర్ 24: చాక్లెట్స్ ఇస్తానంటూ ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నివాసముంటున్న బాలిక (7) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నది. సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉన్నది. సోమవారం ఆ బాలిక తన స్నేహితులతో కలిసి వీధిలో ఆడుకుంటున్నది.
అదే సమయంలో సమీపంలో నివాసముంటున్న వాచ్మన్ మనోహర్ బాలికకు చాక్లెట్స్ ఇస్తానంటూ తన గదిలోకి తీసుకువెళ్లి.. లైంగికదాడికి పాల్పడ్డాడు. కొద్ది సేపటి తర్వాత ఏడుస్తూ ఇంటికి వచ్చిన ఆ బాలిక జరిగిన ఘోరాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో వాచ్మన్ను నిలదీయగా.. తనకు ఏమీ తెలియదని బుకాయించాడు. ఇంటి యజమాని సైతం తన వాచ్మన్ ఎలాంటి తప్పుచేయలేదని, కావాలంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలంటూ దబాయించాడు. దీంతో సోమవారం రాత్రి బాలిక కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.