కొండాపూర్, నవంబర్ 25 : ఆహ్లాదకర వాతావరణం, ఆరోగ్యం, వినోదాన్ని పంచేలా అందమైన పార్కు అతిత్వరలో అందుబాటులోకి రానున్నది. మాదాపూర్ పత్రికనగర్లో రూ.కోటి ఎనభై లక్షల వ్యయంతో అత్యాధునిక హంగులతో అన్ని వయస్సుల వారికి ఆహ్లాదాన్ని అందించేలా పార్కును నిర్మిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగనున్న పార్కు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఆకుపచ్చని చెట్లు, లాన్స్, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక ఆట స్థలం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ విధులు నిర్వహించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు, ప్రజలు సేద తీరేందుకు బెంచ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు, స్కల్పర్లు ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ఉండనున్నాయి. చుట్టుపక్కల కాలనీవాసులతో పాటు విచ్చేసే సందర్శకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పార్కులో గ్రీనరీని ప్రోత్సహించేలా కాలనీ అసోసియేషన్లలో అవగాహన సైతం కల్పించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అభివృద్ధి పేరిట ఇరుకుగా మారుతున్న కాలనీల్లో ప్రభుత్వ స్థలాలను ఆహ్లాదకర వాతావరణాన్ని పంచే పార్కులుగా మలుస్తున్నాం. పిల్లలతో పాటు అన్ని వయస్సుల వారికి ఉపయోగపడేలా పార్కులలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. పార్కులలో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ, ఆరోగ్యానికి సైతం అంతే ప్రాధాన్యతను అందిస్తున్నాం. వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, ప్లే ఏరియాలను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
– అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
త్వరలో అందుబాటులోకి పార్కు..
మాదాపూర్ పత్రికనగర్లో నిర్మిస్తున్న పార్కు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. పార్కు నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా, కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాటు, స్కల్పర్లు, విగ్రహాలతో పాటు గ్రీనరీకి పెద్దపీట వేస్తున్నాం. పార్కు చుట్టూ కంపౌండ్ నిర్మాణాన్ని చేపట్టాం.
– శ్రీనివాస్, ఈఈ, శేరిలింగంపల్లి సర్కిల్