కరోనా వేగంగా విస్తరిస్తున్నది. ఎక్కడికెళ్లాలన్నా వైరస్ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. నలుగురితో కలిసి మాట్లాడే పరిస్థితి లేదు. గ్రూప్ మీటింగ్లు, పిచ్చాపాటి ముచ్చట్లు బంద్ అయ్యాయి. అయితే కరోనా నుంచి రక్షణకు ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు సూచిస్తుండడంతో నిత్యం అనేకమంది జిమ్లకెళ్లడం, ఇతర వ్యాయామాలు చేస్తున్నారు. గతంలో వ్యాయామం చేయని వారు కూడా ఇప్పుడు పార్కులకెళ్లి కసరత్తులు చేస్తున్నారు. వాకింగ్కు వెళ్తున్న వారు నిబంధనలు పాటించాలని, లేకుంటే కరోనా బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలో వైరస్ వ్యాప్తి తీవ్రత తక్కువే అయినా, మనుషులు సమూహాలుగా చేరి వాకింగ్ చేయడం వల్ల వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని రవి హీలియస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.విజయ్భాస్కర్, నేచర్క్యూర్ హాస్పిటల్ ఎండీ డా.భవాని వెల్లడించారు.
పార్కులలో చాలామంది తక్కువ దూరంలో కూర్కొని ఉచ్ఛాస, నిశ్వాసలు చేస్తుంటారు. ఈ సమయంలో ఎదురుగా ఉన్న వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉండి ఉంటే ముక్కు, నోటిలోకి వైరస్ నేరుగా చేరనుంది. ఇది అత్యంత ప్రమాదకరం.
నగరంలో గర్భిణులు, చిన్నారులు కూడా వేలసంఖ్యలో నిత్యం వాకింగ్ చేస్తుంటారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ జనసాంద్రత తక్కువగా ఉన్న సమయాల్లో మాత్రమే వాకింగ్కు వెళ్లాలి. సింగిల్ లేయర్ మాస్కు తప్పక ధరించాలి. వాకింగ్ వెళ్లే ముందు, వచ్చిన తర్వాత చేతులను శానిటైజ్ చేసుకోవడంతోపాటు ఆవిరి పట్టుకోవాలి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇంటి బాల్కానీలోనే వాకింగ్ చేయడం శ్రేయస్కరం.