మెహిదీపట్నం, నవంబర్ 27 : ప్రజలలో చైతన్యం తెచ్చి ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేలా జీహెచ్ఎంసీ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఓటరు నమోదు కార్యక్రమం నాంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్నది. ఆదివారం సెలవు రోజు ఉన్నా జీహెచ్ఎంసీ సిబ్బంది ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. సర్కిల్ -12 పరిధిలోకి వచ్చే నాంపల్లి నియోజకవర్గంలోని మెహిదీపట్నం, రెడ్హిల్స్, విజయ్నగర్ కాలనీ, గుడిమల్కాపూర్, ఆసిఫ్నగర్, మల్లేపల్లి డివిజన్లలో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటరు నమోదును చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిర్వహిస్తున్న ఓటరు నమోదును యువత సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ఇన్కెషాఫ్ అలీ సూచిస్తున్నారు.
18 ఏండ్లు నిండిన వారు నమోదు చేసుకోవాలి
18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా పేరును నమోదు చేసుకోవాలని సర్కిల్ -12 డీసీ ఇన్కెషాఫ్ అలీ చె ప్పారు. సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాల వద్ద తమ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం వల్ల ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
నూతన ఓటర్ల నమోదు..
కార్వాన్, నవంబర్ 27 : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించిన నూతన ఓటర్ల నమోదు కార్యక్రమం ఆదివారం కొనసాగింది. ఓటరు లిస్టులో సవరణలు, ఫొటో మార్పు వంటి అంశాలతో ప్రారంభించిన కార్యక్రమంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు కార్వాన్, గుడిమల్కాపూర్ డివిజన్లలో బీఎల్ఓలు పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ బూత్ల వద్దకు చేరుకొని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు అందజేశారు. నూతన ఓటర్లుగా నమోదయ్యేందుకు యవతీ, యువకులు పలు సూచనలు చేశారు. ఆన్లైన్లో సదుపాయం ఉండడంతో చాలా మంది అక్కడే దరఖాస్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. గుడిమల్కాపూర్ డివిజన్ ఎస్బీఐ కమ్యూనిటీహాల్, పలుబూత్లలో నూతన ఓటర్ల నమోదును కార్పొరేటర్ దేవర కరుణాకర్ పరిశీలించారు.