సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు జాబితా సవరణ, బోగస్, డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియలోనూ అధికారులు అదే అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అనామలిస్, నాన్ మ్యాపింగ్, రిపీటెడ్ ఓటర్లకు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) నేరుగా ఇళ్లకు వెళ్లి నోటీసులు జారీ చేయాల్సిన ప్రక్రియ నత్తనడకగా సాగుతున్నది. వాస్తవానికి ఈ నెల 28 (రేపటి)లోగా అందరికీ నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ప్రతి నియోజకవర్గంలో పట్టుమని పది శాతం కూడా నోటీసుల పంపిణీ జరగకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.
ఈ క్రమంలోనే ముషీరాబాద్ నియోజకవర్గంలో 92,300, మలక్పేటలో 74,536, అంబర్పేటలో 79,831, ఖైరతాబాద్లో 74,977, జూబ్లీహిల్స్లో 1,14,338, సనత్నగర్లో 74,449, నాంపల్లిలో 68,708, కార్వాన్లో 96,389, గోషామహల్లో 69,756, చార్మినార్ 47,934, చాంద్రాయణగుట్టలో 73,889, యాకత్పురలో 87,568, బహదూర్పురలో 83,401, సికింద్రాబాద్లో 84,303, కంటోన్మెంట్లో 93,628 ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇప్పటివరకు డిజిటైజ్ అయిన ఓటర్లలో 24 శాతం మంది ఓటర్లు నాన్ మ్యాపింగ్ ఓటర్లతో కలిపి అనామలిస్ క్యాటగిరీ కింద ఉన్న 6 లక్షల 72 వేల 678 మందితో కలిపి మొత్తం 12 లక్షల 52 వేల పైచిలుకు ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. నోటీసుల జారీలో భాగంగా ఓటరు అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యుల సంతకంతో నోటీసులు అందజేయాలి.
కానీ ఇక్కడ బీఎల్ఓలు కనీసం నోటీసులు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అంతేకాకుండా ఈ నోటీసులో హియరింగ్ తేదీ, వేదికను స్పష్టంగా సూచించాలి. నోటీసు ఎందుకు జారీ చేశారు? ఎప్పుడు, ఏయే ఆధారాలతో హియరింగ్కు హాజరుకావాలనే పూర్తి వివరాలను ఓటర్లకు వివరించాలి. కానీ నోటీసులు జారీ చేసిన అంశంలో ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వాస్తవానికి అనామలిస్, నాన్ మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేసిన తర్వాత నోటీసులిచ్చిన తేదీ నుంచి ఏడు రోజుల్లో హియరింగ్ లక్షల మందికి నోటీసులు జారీ చేసి, హియరింగ్ లు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నందున, ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాకు ఫిక్స్ చేసుకున్న అక్టోబర్ 19వ తేదీని మరింత ముందుకు పొడిగించుకోవల్సిన పరిస్థితి లేకపోలేదు.
