Vote | సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఓటరు ప్రక్రియను జీహెచ్ఎంసీ సమూల ప్రక్షాళన చేపట్టింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరుగా రెండు ఓటరు కార్డులు, ఒకే కుటుంబంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయాల్సి రావడం, డూప్లికేట్ ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా అధికారులు తప్పులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు.
పోలింగ్ బూత్ల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. అడ్రస్ మారిన ఓటరు.. కొత్త స్థానంలో ఓటరు కార్డు పొంది, పాత స్థానంలో కొనసాగుతున్న వాటి వివరాలను సేకరించారు. ఈ మేరకు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,81,405 మంది ఇళ్లు మారినట్లు గుర్తించి వారికి ఒకే చోట ఓటరు కార్డు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ సారి ఇంటిల్లిపాదికి ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం నాటికి 3,60,849 ఓటర్లను సరిచేయగా డిసెంబర్ నుంచి మార్చి నాటికి 17,864 ఓటర్లను సరిచేశారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 54,259 డూప్లికేట్ ఓట్లను అధికారులు ఓటరు జాబితా నుంచి తొలగించారు. ముషీరాబాద్లో 1038, మలక్పేటలో 2421,అంబర్పేటలో 2317,ఖైరతాబాద్లో 1640, జూబ్లీహిల్స్లో 4840, సనత్నగర్లో 1460, నాంపల్లిలో 7072,కార్వాన్లో 6738,గోషామహల్లో 3260, చార్మినార్లో 3348, చాంద్రాయణగుట్టలో 4433, యాకత్పురలో 4281, బహదూర్పురలో 7742, సికింద్రాబాద్లో 1320, కంటోన్మెంట్లో 2349 ఓట్లు డూప్లికేట్గా ఉన్నట్లు గుర్తించి తొలగించారు.