సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ):గండిపేట జలాశయం.. నగర శివారులో ఉన్న ఆహ్లాదకర ప్రకృతి సౌధం. చల్లని సాయంత్రాన గండిపేట జలాల్లోకి సూర్యుడు జూరుకుంటున్న వేళ… వినసొంపుగా వినిపించే సంగీత ఝరిలో సేద తీరాలని ఎవరికి ఉండదు. అలాంటి అద్భుత అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం నగరవాసులకు కల్పించింది. గండిపేట జలాశయం తీరంలో రూ.36 కోట్లతో అత్యాధునిక ల్యాండ్స్కేపింగ్ పార్కును అభివృద్ధి చేసింది. ఐటీ కారిడార్కు అదనపు ఆకర్షణగా ఉన్న ఈ ఆధునిక పర్యాటక క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. ఒకేసారి 3వేల మంది వరకు కూర్చునేలా ఉన్న విశాలమైన ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా శనివారం పరంపర పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. వీకెండ్ కావడంతో సందర్శకులు ఎంతో ఉత్సాహంగా తరలివచ్చి ఎన్నో మధురానుభూతులను వెంట తీసుకెళ్లారు. మనసుకింపైన పాటలు, ఉల్లాసంతోపాటు ఉర్రూతలూగించే సంగీతానికి సందర్శకులు ముగ్ధులయ్యారు.
నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ జలాశయం, నగర శివారులో గండిపేట జలాశయం నిత్యం వేలాది మంది సందర్శకులకు పేవరేట్ హాట్స్పాట్లుగా మారాయి. వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికి వెళితే బాగుంటుందంటే… చాలామందికి వెంటనే గుర్తొచ్చేది హుస్సేన్సాగర్. ఆ తర్వాత ఇటీవల కొత్తగా గండిపేట జలాశయం తీరంలో రూ.36 కోట్లతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ల్యాండ్స్కేపింగ్ పార్కు. అక్టోబర్లో ప్రారంభమైన ఈ పార్కు నగరవాసులకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిచ్చే కేంద్రంగా మారింది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పార్కు సరికొత్త అనుభూతులను పంచుతోంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గండిపేట ల్యాండ్ స్కేపింగ్ పార్కులో పొందే అనుభూతి ఎంతో అద్భుతంగా ఉంటోందంటూ సందర్శకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా సూర్యాస్తమయంలో గండిపేట జలాల్లోకి సూర్యుడి జారుకుంటున్నట్లు కనిపించే దృశ్యాలు మాటల్లో వర్ణించలేకపోతున్నామని పలువురు సందర్శకులు ఆ సమయంలోని ఫొటోలను షేర్ చేస్తూ చెప్పారు.
జలాశయం లోపలి వైపు పార్కు…
గండిపేట జలాశయం పై నిర్మించిన ఆనకట్టను ఆనుకొని లోపలి వైపు ఉన్న విశాలమైన స్థలంలో హెచ్ఎండీఏ ఇప్పటి వరకు నగరంలో లేనటువంటి థీమ్తో గండిపేట ల్యాండ్ స్కేపింగ్ పార్కును రూ.36 కోట్లతో అభివృద్ధి చేసింది. జలాశయం ఆనకట్టపై 500 మీటర్లు నడిచిన తర్వాత వచ్చే ప్రవేశ ద్వారం ఎంతో అద్భుతంగా ఉన్నదని సందర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్కును సందర్శించడంతో సరికొత్త అనుభూతిని పొందుతున్నామనే అభిప్రాయాన్ని సందర్శకులు వ్యక్తం చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక
గండిపేట పార్కులో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఒకేసారి 3వేల మంది వరకు కూర్చునేలా విశాలమైన ప్రాంగణంతో పాటు ఎత్తయిన వేదికను ఏర్పాటు చేశారు. పార్కు ప్రారంభమైన మూడు నెలల తర్వాత మొట్ట మొదటి సారిగా శనివారం పరంపర పేరుతో సంగీత కచేరి కార్యక్రమాన్ని సాయంత్రం నిర్వహిస్తే సుమారు 2500 మంది వరకు ప్రత్యక్షంగా వీక్షించారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ప్రభుత్వం జలాశయాల సంరక్షణతో పాటు వాటి చెంత సేద తీరేలా ఏర్పాటు చేస్తున్న ఆనకట్టలు, ల్యాండ్ స్కేపింగ్ పార్కులు ప్రజలకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తున్నాయి.
ఐటీ కారిడార్కు అదనపు ఆకర్షణగా…
జూబ్లీహిల్స్-మాదాపూర్ నుంచి మొదలయ్యే ఐటీ కారిడార్ కోకాపేట-నార్సింగి వరకు విస్తరించింది. దీంతో కోకాపేటను ఆనుకొని ఉన్న గండిపేట జలాశయం ఇప్పుడు ఆధునిక పర్యాటక క్షేత్రంగా మారింది. దీంతో ఐటీ కారిడార్లో గండిపేట ల్యాండ్ స్కేపింగ్ పార్కు అదనపు ఆకర్షణగా మారింది. ఐటీ కారిడార్లోని కొండాపూర్లో ఉన్న బొటానికల్ గార్డెన్ తర్వాత ఆ స్థాయిలో ఆకర్షణీయంగా ఈ పార్కు మారింది. ప్రతి రోజు 1000 నుంచి 1500 మంది సందర్శకులు వస్తున్నారని, శని,ఆది వారాల్లో మాత్రం 10వేల మంది వరకు వస్తున్నారని పార్కు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాల్గూడ, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలకు గండిపేట జలాశయం సమీపంలోనే ఉండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది.