గ్రేటర్ పరిధిలో విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో.. గత మూడు నాలుగు రోజులుగా సీజనల్ వ్యాధుల బారినపడి నగరంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఓపీల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎవరిని కదిలించినా జలుబు, దగ్గు, తల నొప్పి, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ కనిపిస్తున్నారు. ఇంట్లో ఒకరికి ఈ లక్షణాలు వచ్చాయంటే వరుసబెట్టి మిగిలిన కుటుంబ సభ్యులంతా అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్లనే సీజనల్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నగరంలో కొన్ని రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పులతో చిన్నా పెద్దా తేడాలేకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఒంటినొప్పులు తదితర ఫ్లూ లక్షణాలతో కూడిన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా దవాఖానలతో పాటు ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్స్లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణం కంటే 50 శాతం వరకు ఓపీ పెరిగినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. చల్లదనం వల్ల ఎక్కువగా ఫ్లూ కేసులు అంటే జలుబు, జ్వరం వంటి కేసులు వస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా సర్వేలెన్స్ అధికారి డా.శ్రీహర్ష యాదవ్ తెలిపారు. ఇక చిన్నపిల్లలకు సంబంధించి నిలోఫర్ దవాఖానాలో సైతం ఈ లక్షణాలతో కూడిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆందోళన అవసరం లేదు
వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా నగరంలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. వర్షాకాలం, చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధారణమే. ఈ సమయంలో సాధారణంగా సీజనల్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఈసారి రోగుల సంఖ్య తక్కువగానే ఉంది. వారం రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడంతో పాటు రెండు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే వెంటనే కోలుకుంటారు.
– డాక్టర్ రాజేంద్రప్రసాద్, సూపరింటెండెంట్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్