సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలను ఉల్లంఘించిన గురు రాఘవేంద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించడంతోపాటు అమ్మకం సమయంలో తెలిపిన అన్ని వసతులను కల్పించాలని పేర్కొన్నది. హిమాయత్నగర్లోని గురు రాఘవేంద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ‘గురు రాఘవేంద్ర రాయల్ ఫామ్స్’ పేరుతో గాజులరామారం సమీపంలో విల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో గాజులరామారానికి చెందిన ఎలవర్తి శ్రీనివాసరావు, ఎలవర్తి రమాదేవి సైట్కు రూ.43.75 లక్షలు, రూ.30.25 లక్షలు నిర్మాణంతో పాటు వసతులను కల్పించేందుకు ఒప్పందం చేసుకున్నారు.
2019లో చెల్లింపులన్నీ పూర్తి చేశారు. నందుల హేమలత, నందుల వెంకట పృథ్వీరాజ్లు కూడా రెండు దఫాలుగా 2019లోనే డబ్బులు చెల్లించారు. ఈ రెండు కుటుంబాలు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో విల్లాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే అనుకున్న ప్రకారం విల్లాల్లో సరైన వసతులు కల్పించలేదు. దీంతో బాధితులు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1లో కేసు వేశారు. కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, ఆర్.నారాయణరెడ్డితో కూడిన బెంచ్ కేసు వివరాలను పరిశీలించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం.. మురుగునీటి ప్లాంట్, బాస్కెట్ బాల్ కోర్టు, పిల్లల ఆటస్థలం, పార్కు అభివృద్ధి, వర్షపునీటి సంరక్షణ, కమ్యూనిటీ క్లబ్ హౌస్, సీసీ టీవీ, సోలార్ ఫెన్షింగ్ సౌకర్యాలను కల్పించాలని కమిషన్ తీర్పు వెలువరించింది. అంతేగాకుండా ఎలవర్తి శ్రీనివాసరావు, ఎలవర్తి రమాదేవి, నందుల హేమలత, నందుల వెంకట పృథ్వీరాజ్లకు రాఘవేంద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం, రూ.10వేల చొప్పున కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. కొనుగోలులో సహకరించిన అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్పై కేసును కొట్టివేసింది.