మేడ్చల్, సెప్టెంబర్ 28: వినాయక నిమజ్జనం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదానాలు చేశారు.పలు చోట్ల లడ్డూ వేలం పాటలు జోరుగా నిర్వహించారు. వేల నుంచి మొదలుకుంటే రూ.లక్షల వరకు లడ్డూ ధరలు పలికాయి. అందంగా అలంకరించిన శకటంపై వినాయక విగ్రహాలను ఉంచి మహిళలు, చిన్నా, పెద్దా నృత్యాలు చేస్తూ వినాయకుడి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 28: రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనం కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో గురువారం ప్రశాంతంగా నిర్వహించినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ డీ.ఎస్ చౌహన్ తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వినాయక ఘాట్ను గురువారం రాత్రి ఆయన సందర్శించారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల్లో 12వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. 6వేలకు పైగా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు చేపట్టి పర్యవేక్షణ జరిపినట్లు పేర్కొన్నారు.నిమజ్జనం చేసేందుకు ఎక్కువ సమయం పట్టకుండా మూడు క్రేన్ల ద్వారా నిమజ్జనం చేసినట్లు ఆయన తెలిపారు. సీపీ వెంట ఏసీపీ శ్రీనివాస్,ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సై శేఖర్,సర్పంచ్ సురేశ్, భక్తులు ఉన్నారు.