మేడ్చల్, జూన్14(నమస్తే తెలంగాణ): ప్రగతి పథంలో పల్లెలు దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. ప్రతి పల్లెలో మంచినీటి సౌకర్యం, రోడ్లు, డంపింగ్యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కమ్యునిటీ భవనాల నిర్మాణాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 61 గ్రామాల్లో చేపట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 7 కోట్ల 16 లక్షల 89 వేల నిధులను పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఏడాది పల్లెల అభివృద్ధికి మరిన్ని ప్రత్యేక నిధులతో పాటు ఎమ్మెల్యే నిధులు, జడ్పీ నిధులు రూ. 10 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 18 కోట్ల నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్యార్డులను నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేశారు.
– కొంతం వెంకట్రెడ్డి, సర్పంచ్, కాచవాని సింగారం
రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలన్నీ అభివృద్ధి చెందాయి. పట్టణాల్లో ఉన్న సౌకర్యాలను పల్లెల్లో కల్పిస్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు తొలగి ప్రకృతి వనాలతో పల్లెలన్నీ పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయి. పల్లెల పై పట్టుఉన్న కేసీఆర్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం.
-రామకృష్ణారెడ్డి, రైతు, కాచవాని సింగారం