వ్యవసాయ యూనివర్సిటీ/శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 1: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వినాయక వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ని శంషాబాద్ పట్టణం, మండలం, గండిపేట్ మండలం, బండ్లగూడ మున్సిపాలిటీ, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు రాజేంద్రనగర్ పట్టణ ప్రాంతంలో వాడవాడలలో మండపాలలో గణనాథులు కొలువుదీరాయి. శంషాబాద్ పట్టణంలోని ఆయా వార్డులలో కొలువుదీరిన మండపాలలో ప్రత్యేక పూజలలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని రాళ్లగూడ, తొండుపల్లి, గొల్లపల్లి, ఊటుపల్లి, కోత్వాల్గూడ, సాతంరాయిలలో పూజలు నిర్వహించారు. దీంతో పాటు మండలంలోని సుల్తాన్పల్లి, నర్కూడ, చౌదర్గూడ, పెద్దషాపూర్, పాలమాకుల, జూకల్, చిన్నగోల్కొం డ, పెద్దగోల్కొండలతో పాటు ఆయా గ్రామాలలో గణపతులకు పూజలు చేశారు. రాజేంద్రనగర్ పట్టణప్రాంతంలోని మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, హైదర్గూడ, శివరాంపల్లి, కాటేదాన్ తదితర ప్రాంతాలలో లంబోదరుడికి వైభవంగా పూజలు చేశారు.
*శంషాబాద్ మండలంలోని రషీద్గూడలో గ్రామస్తులందరూ కలిసి ఒకేచోట (మట్టి) వినాయకుడిని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం గత 13 సంవత్సరాల నుంచి గ్రామంలో ఒకే విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
విఘ్నేశ్వరుని పూజలకు హాజరైన ముస్లింలు
*కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ విజ్ఞానం ప్రసాదించు స్వామీ అంటూ సులేమాన్ డివిజన్ చింతల్ మెట్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలలో గురువారం టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు షేక్ నయ్యూమోద్దీన్ గణనాథుడిని వేడుకున్నారు. గణేశ్ కమిటీ సభ్యులు సురేశ్, శివకుమార్, రాజు, మధులను ఆయన అభినందించారు. డివిజన్లో కుల, మతాలకు అతీతంగా ఏడాదిలో జరిగే ముఖ్యమైన దసరా, దీపావళి, వినాయక చవితి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ వంటి పండుగలకు సోదరాభావంతో కలిసి పండుగలు జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎండీ చహన్ బాయ్, ఎండీ సమీర్ సలామ్, ఖలీమ్ అన్సారీ, ఖాసిం, విష్టు తదితరులు పాల్గొన్నారు.