మేడ్చల్, మే 16 (నమస్తే తెలంగాణ) : నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులకు ఆదేశించారు. అంబేద్కర్ సచివాలయం నుంచి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం పంటల కోసం వివిధ రకాల విత్తనాలు 18 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఉన్న టాస్క్ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, శాంపిల్స్ సేకరించి పరిశీలించాలని సూచించారు. విత్తన డీలర్ల దుకాణాల్లో తప్పనిసరిగా లైసెన్స్ ప్రదర్శించాలని, విత్తనాల విక్రయ బిల్లు పూర్తి వివరాలతో అందించాలని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
మిషన్ అమృత్ సరోవర్పై వీడియో కాన్ఫరెన్స్
మిషన్ అమృత్ సరోవర్పై మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అమోయ్కుమార్ పాల్గొన్నారు. మినిస్టర్ ఆఫ్ రూరల్ అభివృద్ధి కార్యదర్శి శైలేశ్ కుమార్ సింగ్ కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా పరిధిలోని 61 గ్రామ పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగ్యస్త, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, తదితరులు ఉన్నారు.