శంషాబాద్ రూరల్, జూన్ 9: శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని 21 మహిళా సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన డబ్బులను బ్యాంకులో జమచేయకుండా వీవోఏ మమత కాజేసిందని ఆయా సంఘాల మహిళలు గ్రామ సర్పంచ్ కోటేష్గౌడ్ దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన సర్పంచ్ వీవోఏ మమతతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. అయితే నెల రోజుల పాటు వేచిచూసినా ఫలితం లేకపోవడంతో సోమవారం బాధిత మహిళలు సర్పంచ్ను మరోమారు సమస్య విషయమై కలువగా.. ఆయన వీవోఏ మమత కుటుంబ సభ్యులను పిలిపించి డబ్బుల విషయమై ప్రశ్నించగా మమత భర్త ఆంజనేయులుగౌడ్ డబ్బుల విషయంపై తనకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేసాడు.
ఇదే విషయమై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయగా ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆగ్రహించిన 21 సంఘాల మహిళలు మంగళవారం పాలమాకుల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జాం అయింది. సీఐ నరేందర్రెడ్డి అక్కడకు చేరుకొని వారిని సముదాయించారు. బాధిత మహిళలు మాట్లాడుతూ.. రోజువారిగా కష్టపడుతూ రూ.కోటి 56లక్షలు జమచేస్తే వీవోఏ మమత వాటిని బ్యాంకులో జమచేయకుండా తన సొంతానికి వాడుకున్నట్లు వాపోయారు. తదనంతరం వారు సీఐ నరేందర్రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.