సైబర్ నేరాలపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు
సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించి ఓ వృద్ధురాలి ఖాతాలో నుంచి సైబర్ నేరగాళ్లు రూ.9.37 లక్షలు కాజేశారు. బోయిన్పల్లికి చెందిన బాధితురాలు ఎస్బీఐ యోనో యాప్ను ఉపయోగిస్తుంది. యాప్ వాడకంలో సమస్య రావడంతో కస్టమర్ కేర్కు నాలుగైదు సార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొద్ది సేపటికి తాము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేశారు. ఆమె నిజమేనని భావించి అన్ని వివరాలు చెప్పింది. దీంతో ఖాతాలో ఉన్న డబ్బంతా మాయమైంది.
మిస్త్రీగంజికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము చెప్పినట్లు మీరు పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని నమ్మించారు. సైబర్నేరగాళ్లు పంపించిన లింక్ క్లిక్ చేసి రూ. 3.94 లక్షలు పోగొట్టుకున్నాడు. అలియాబాద్కు చెందిన బాధితుడు రూ.2.4 లక్షలు మోసపోయాడు.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ నమ్మించి మోహిదీపట్నంకు చెందిన బాధితుడి నుంచి రూ.1.57 లక్షలు కాజేశారు.
లోన్యాప్ల నుంచి వేధింపులు జరుగుతున్నాయని ఒకరు, గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకరమైన ఫొటోలు, పదజాలంలో వేధిస్తున్నారంటూ మరొకరు పోలీసులను ఆశ్రయించారు.
అమీర్పేట్కు చెందిన ఓ వ్యాపారి ఫొటోలను మార్ఫింగ్ చేసిన నేరగాళ్లు.. మీ స్నేహితులు, బంధువులకు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేసి రూ. 2.90 లక్షలు వసూలు చేశారు.
ముద్ర యోజన పేరుతో మోసం
సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : ప్రధాన మంత్రి ముద్ర యోజన పేరుతో సైబర్నేరగాళ్లు నకిలీ యాప్ లింక్ను పంపించి నయా మోసాన్ని ప్రారంభించారు. బాధితుల వద్ద నుంచి సుమారు రూ.30 వేలు వసూలు చేశారు. మంగళవారం ఇద్దరు బాధితులు మోసపోయామంటూ సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రధాన మంత్రి ముద్ర యోజన రుణాలంటూ దేశ వ్యాప్తంగా ఈ ముఠా మోసం చేస్తుందని సైబర్క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రాసద్ తెలిపారు.