కవాడిగూడ, డిసెంబర్ 22: పార్లమెంట్పై దాడి జరగడమంటే ప్రజాస్వామ్యంపై జరిగినట్లేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని, హోంమంత్రిని అడిగితే హిట్లర్, ముస్సోలినిలా ప్రవర్తించి ఎంపీలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. పార్లమెంట్, రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్పై దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిరసన సభ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.
ఈ నిరసన సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, ఎం. అంజన్కుమార్ యాదవ్, మల్లు రవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… దేశ ప్రధాని, హోంమంత్రి హిట్లర్, ముస్సోలిని లాగా జైలుకు వెళ్లక తప్పదన్నారు. అగంతకులకు పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీలేనని, వారిని సస్పెండ్ చేశారా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏమన్నారని సభ్యత్వం రద్దు చేశారని, అలాగే తృణమూల్ ఎంపీ ప్రశ్నిస్తే సభ్వత్వం రద్దు చేశారని తెలిపారు.
నరేంద్ర మోదీ తప్పులను ఎండగట్టడానికి కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ… పార్లమెంట్కే రక్షణ లేకుంటే ప్రజలకు రక్షణ ఎవరని మండిపడ్డారు. సేవ్ డెమోక్రసి పేరుతో దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు తెలుపుతున్నదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ…రాబోయే రోజుల్లో మరిన్ని పుల్వామా దాడులు జరిగే అవకాశం ఉన్నదని ఆరోపించారు. పార్లమెంట్ ఘటనపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. విపక్ష సభ్యులను బయటికి పంపించడం సరైంది కాదని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ముఖ్యమైన బిల్లులపై చర్చ జరుగుతుంటే అందరిని బయటికి పంపించి బలవంతంగా బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే విపక్ష సభ్యులను సభలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.