Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 ( నమస్తే తెలంగాణ) : లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. నగర రోడ్లపై దూసుకుపోతున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాహనాలను కొనుగోలు చేయడానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పోటీపడుతున్నారు. మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో విడుదలైన వాహనాలు తమ గ్యారేజీలో ఉండాల్సిందే అన్నట్టుగా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో లగ్జరీ వాహనాలు ఎక్కువగా మహానగరంలోనే అమ్ముడుపోతాయి. ప్రపంచ నగరాల కంపెనీలు హైదరాబాద్లో బ్రాంచ్లు ఏర్పాటు చేయడం కూడా లగ్జరీ కార్ల అమ్మకాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా నిఫుణులు విశ్లేస్తున్నారు. కనీసం రూ.20 లక్షల నుంచి 7 కోట్ల వరకు విలువైన కార్లు అమ్ముడుపోతున్నాయి.
గతేడాది రూ.20 లక్షలకు పైగా విలువ చేసే 17,111 కార్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ప్రస్తుతం వరకు 3,768 కార్లు అమ్ముడుపోయాయని అధికారులు చెబుతున్నారు. ఇతరులకు భిన్నంగా ఉండాలనే లక్ష్యంతో పాటు అందులో ఉండే భద్రతపరమైన అంశాలతో ఎక్కువగా ఖరీదైన కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది ప్రముఖ బిజినెస్ మాయన్ కుమారుడు నజీర్ఖాన్ అనే వ్యక్తి రూ.7 కోట్లపైనే విలువజేసే ఎంసీల్యారెన్ 785 ఎల్టీ స్పైడర్ వాహనం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అల్లరి నరేశ్ రూ.68 లక్షల విలువజేసే పీయూఈవీ6 వాహనం కొనుగోలు చేశారు.