ఉస్మానియా యూనివర్సిటీ : త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు వెల్లువలా వచ్చిపడుతోంది. విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు, ఉద్యమంలో భాగంగా ఎన్నో కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన గెల్లును గెలిపించేందుకు విద్యార్థి నాయకులు ప్రతిన బూనుతున్నారు. గెల్లుకు ఆర్థికంగా సైతం తోడ్పాటును అందించేందుకు సాధారణ విద్యార్థులు సైతం ముందుకు వస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో టీజీవీపీ, ఎంఎస్ఎఫ్, అంసా, బీఎస్ఎఫ్, గిరిజన విద్యార్థి సంఘం, స్కాలర్స్ అసోసియేషన్, బంజారా విద్యార్థి సేవా సంఘం తదితర విద్యార్థి సంఘాలు గెల్లుకు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేదింటి బీసీ బిడ్డను గుర్తించి టీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తిని శాసనసభకు పంపితే ప్రజల అభ్యున్నతికి పనిచేస్తాడన్నారు. విద్యార్థి ఉద్యమకారులకు టీఆర్ఎస్ పెద్దపీట వేస్తూ అనేక అవకాశాలు కల్పిస్తోందని గుర్తు చేశారు. ఆయన గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా అందజేయాలని ప్రజలను కోరారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ఖర్చు కోసం రూ.యాభై వేలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థ సంఘాల నాయకులు నక్క శ్రీశైలం యాదవ్, చందు, మాదారం సుదర్శన్, బోరెల్లి సురేశ్, శ్రీనునాయక్, నివాస్, అంజినాయక్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్, నేతలు జంగయ్య, కాటం శివ, శ్రీకాంత్గౌడ్, మిద్దె సురేశ్, నాగేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.