Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 8న నగరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు.
మోనప్ప(రాజీవ్ గాంధీ విగ్రహం) జంక్షన్, గ్రీన్ లాండ్స్, ప్రకాశ్నగర్, రసూల్పురా సీటీఓ, ఫ్లాజా, ఎస్బీహెచ్, వైఎంసీఏ, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్డు, ఆలుగడ్డబావి, చిలకలగూడ జంక్షన్, ఎంజే రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్పీ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆ రూట్లు, జంక్షన్ల వైపు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే స్టేషన్కు చేరుకోవాలని తెలిపారు. ఉప్పల్ – సికింద్రాబాద్ రూట్లో సైతం ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఆర్టీసీ బస్సుల కోసం కరీంనగర్ రూట్లో వచ్చే దోబీఘాట్, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు బిసన్ పోలో, రంగారెడ్డి, కర్నూల్, అచ్చంపేట్, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట్, వరంగల్, యాదాద్రి రూట్లో వచ్చే వారు ఆర్ఆర్సీ గ్రౌండ్లో పార్కు చేయాలి.
రాజీవ్ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్ పార్కు గ్రౌండ్, పికెట్ డిపో ప్రాంగణంలో, అలాగే రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డులో పార్కు చేయాలి.
రాష్ర్టానికి రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు రాబోతున్నది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఈ ఎక్స్ప్రెస్ రైలును నడుపనున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పాటు మరో మూడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు గురువారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. అలాగే సికింద్రాబాద్-మహబూబ్నగర్ స్టేషన్ల మధ్య రూ.1,410 కోట్లతో నిర్మించిన 85.24 కిలోమీటర్ల దూరం డబుల్ లైను, విద్యుదీకరణ పనులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే రూ.720 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన వేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్కు సంబంధించిన 13 నూతన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.