సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): తీసుకున్న రుణం ఇచ్చేసి ఎవరికీ అనుమానం రాకుండా అదే డబ్బును దోపిడీ చేసిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురం ఠాణా పరిధిలో ఈ నెల 6న వ్యాపారిపై దాడి చేసి డబ్బు ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసు వివరాలను సోమవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
వనస్థలిపురంలో నివాసముండే వెంకట్రెడ్డి ఆటోనగర్లో ఎంఆర్ఆర్ వైన్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. వెంకట్రెడ్డి బంధువు వద్ద నిందితుడైన మహ్మద్ అబ్దుల్ హీద్ అలియాస్ నయీం పలు దఫాలుగా రూ. 50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని వెంకట్రెడ్డి బంధువు ఒత్తిడి చేయడంతో నయీం దోపిడీకి ప్లాన్ చేశాడు. ఈ మేరకు భవానీనగర్, తలాబ్కట్టకు చెందిన నయీం యాఖత్పురా, భవానీనగర్కు చెందిన రహీమ్ ఘోరీ, ఒమర్ బీన్ అమ్జద్ అల్జబ్రీ అలియాస్ ఒమర్, అనిబిన్ హమ్జ అల్జబ్రీ, చార్మినార్కు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఫహద్ బిన్తో దోపిడీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 15 రోజుల్లో డబ్బు ఇస్తానని అప్పు ఇచ్చిన వ్యక్తికి నయీం ఫోన్ చేసి చెప్పడంతో అతడు తన బంధువైన వెంకట్రెడ్డికి అందజేయాలని చెప్పాడు. జనవరి 6న డబ్బులు ఇస్తానని నయీం, వెంకట్రెడ్డికి ఫోన్ చేయడంతో ఎంఆర్ఆర్ వైన్స్ వద్దకు రమ్మని చెప్పాడు. నయీం అక్కడే రూ. 50 లక్షలు చెల్లించి వెళ్లిపోయాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన ముఠా సభ్యులు వెంకట్రెడ్డిని గమనిస్తున్నారు. వెంకట్రెడ్డి డబ్బుల సంచితో తన వద్ద పని చేసే వ్యక్తితో బైక్పై ఇంటికి బయలుదేరగా, కమలానగర్, సాయిబాబా ఆలయం సమీపంలో ముఠా సభ్యులైన ఘోరి, ఒమర్లు అటకాయించి నగదు బ్యాగ్ను లాక్కొనే ప్రయత్నం చేశారు. వెంకట్రెడ్డి అడ్డుకోవడంతో సగం వరకు డబ్బు తీసుకుని పరారయ్యారు. ఈ సొమ్మును ప్రధాన నిందతుడైన నయీం ముఠా సభ్యులకు కొంత ఇచ్చి మిగిలిన దానితో ముంబయి వెళ్లారు. పోలీసుల నిఘా పెరగడంతో దుబాయ్ పారిపోయేందుకు ట్రావెల్ ఏజెంట్ అబ్దుల్ రహమాన్ను డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని చెప్పారు. ఇందులో ఒకరు బెంగుళూర్ నుంచి మిగతా వారు ముంబయి నుంచి దేశం విడిచి వెళ్లాలని ప్లాన్ చేశారు.
పక్కా సమాచారంతో…
దోపిడీ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకుని విచారించారు. సీసీఎస్, ఎస్వోటీ, వనస్థలిపురం పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముఠా కోసం గాలించారు. నిందితులు డాక్యుమెంట్లను తీసుకునేందుకు హైదరాబాద్కు వస్తున్నట్లు పక్కా సమాచారం ఉండడంతో, ఇంజాపూర్ వద్ద బెంజ్కారులో వస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రహీంఘోరీ పరారీలో ఉండగా, మిగతా నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక బైక్, ఐదు మొబైల్ ఫోన్లు, ఇద్దరు నిందితుల పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించిన పోలీసులను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, క్రైమ్స్ డీసీపీ శ్రీబాల, ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ పురుషోత్తం రెడ్డి, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.