బంజారాహిల్స్, జనవరి 21: ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కరోనా పరీక్షా కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. జ్వరం, జలుబు లక్షణాలు తీవ్రంగా ఉన్న వా రందరూ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రజలు కొవిడ్ పరీక్షా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆరు కొవిడ్ నిర్ధారణ కేంద్రాల్లో 781 మందికి పరీక్షలు చేశారు. వారిలో 181 మందికి పాజిటివ్గా తేలింది. బంజారాహిల్స్ రోడ్ నం. 7లోని యూపీహెచ్సీలో 186 మందికి పరీక్షలు చేయగా వారిలో 47 మందికి పాజిటివ్గా తేలింది. జూబ్లీహిల్స్ పరిధిలో అత్యధికంగా 51 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. పంజాగుట్టలో 55 మందిలో 31 మందికి, ఫిలింనగర్లో 113 మందిలో ఎమినిది మందికి, చింతల్బస్తీలో 150 మందిలో 19 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారందరికీ హోమ్ ఐసొలేషన్ కిట్స్ అందజేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్ బస్తీ దవాఖానలో పనిచేస్తున్న ముగ్గురికీ పాజిటివ్గా తేలడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది.
టీనేజర్లకు ప్రత్యేక కేంద్రంలో వ్యాక్సినేషన్
రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కొవిడ్ టీకాలకు ముందుకొస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొవిడ్ రెండో డోస్ టీకాలతో పాటు 15 నుంచి 18 ఏండ్ల వయసున్న టీనేజర్లు పెద్ద సంఖ్యలో టీకాల కోసం వస్తున్నారు. వీరి కోసం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం. 11లోని సరస్వతీ స్కూల్లో ప్రత్యేక టీకా కేంద్రం ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో 144 మంది టీనేజర్లకు టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ స్కూల్ కరస్పాండెంట్ రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.