హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకురావడాన్ని మహిళా ఉద్యోగులు, అధికారులు స్వాగతిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం అధ్యక్షురాలు వీ మమత తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీవో భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళా అధికారులంతా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇదే తరహాలో రాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నెల 4న టీజీవో భవన్లో ప్రారంభంకానున్న మహిళా దినోత్సవ వేడుకలను 4, 5, 6, 8 తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజీవో కోశాధికారి ఎన్ సహదేవ్, మంజులారెడ్డి, వెంకటయ్య, సుజాత, సబిత, స్వర్ణలత, లావణ్య, సునీతాజోషి, సంధ్యారాణి, సులోచన, వరలక్ష్మి, అపర్ణ, కల్యాణి, జ్యోతిరెడ్డి, పద్మలత, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.